ఏపీ డ్రగ్స్ రచ్చ: టీడీపీకి డీజీపీ షాక్; చంద్రబాబు, లోకేష్ లతో పాటు టీడీపీ నేతలకు లీగల్ నోటీసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న విషయం తెలిసిందే. తాలిబన్ డ్రగ్స్ కు తాడేపల్లి ప్యాలెస్ కు లింకేంటి ? డ్రగ్స్ స్మగ్లింగ్ వెనుక ఉన్న బిగ్ బాస్ ఎవరు? అంటూ పెద్ద దుమారమే రేపింది టీడీపీ. గుజరాత్లోని ముంద్రా పోర్టులో పట్టుబడిన హెరాయిన్ కు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదని పోలీసు ఉన్నతాధికారులు పదేపదే చెబుతున్నా అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని భావించిన పోలీస్ బాస్ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు, పలు పత్రికల యాజమాన్యాలకు లీగల్ నోటీసులు పంపించారు.
డ్రగ్స్ కు ఏపీకి సంబంధం లేదని చెప్తున్న పోలీసులు, అయినా టీడీపీ ఆరోపణలు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పాటు డ్రగ్స్ వ్యవహారంపై పదే పదే విమర్శలు చేస్తున్న పలువురు టిడిపి నేతలకు, డ్రగ్స్ పై తప్పుదోవపట్టించే కథనాలను ప్రసారం చేస్తున్న పలు మీడియా సంస్థలకు డిజిపి గౌతమ్ సవాంగ్ నోటీసులు జారీ చేశారు. కేంద్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ గుజరాత్ లో స్వాధీనం చేసుకున్న హెరాయిన్ కు, ఆంధ్రప్రదేశ్ అడ్రస్ మాత్రమే వాడుకున్నారని, దానితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధమైన సంబంధం లేకున్నాతెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని పోలీసులతో పాటుగా, ప్రభుత్వం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది
టీడీపీ చేస్తున్నవి నిరాధారమైన ఆరోపణలు ..చంద్రబాబుతో పాటు వారికి డీజీపీ లీగల్ నోటీసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ రవాణాపై ఎటువంటి ఆధారాలు లేనప్పటికీ తెలుగుదేశం పార్టీ నేతలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, పలు మీడియా సంస్థలు తప్పుడు వార్తా కథనాలను ప్రచురిస్తున్నాయని పేర్కొంటూ చంద్రబాబు, లోకేష్, కింజారపు రామ్మోహన్ నాయుడు, ధూళిపాళ్ళ నరేంద్ర, బోండా ఉమ, కొమ్మారెడ్డి పట్టాభి, బుద్ధ వెంకన్నలతోపాటు, పలు మీడియా సంస్థల అధినేతలు, ఎండిలు, ఎడిటర్లకు కూడా లీగల్ నోటీసులు జారీ చేశారు. డిజిపి తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాసరెడ్డి ఈ నోటీసులను జారీ చేశారు.
పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగేలా అసత్య ఆరోపణలు చేశారంటూ నోటీసులు
గుజరాత్ ముంద్రా పోర్ట్ లో పట్టుబడిన 21 వేల కోట్ల విలువైన హెరాయిన్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదని పోలీసులు ప్రకటన చేసినప్పటికీ, తెలుగుదేశం పార్టీ నేతలు పోలీసు శాఖ ప్రతిష్టకు కూడా భంగం కలిగించే విధంగా, పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసేలా అసత్య ఆరోపణలు చేశారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నోటీసులలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ హెరాయిన్ తో సంబంధం లేదని డీఆర్ ఐ ప్రకటించినప్పటికీ దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.
వాస్తవాలు తెలుసుకోకుండా ఎలా వార్తలు ప్రచురిస్తారు? క్షమాపణ చెప్పాల్సిందే !!
వాస్తవాలను నిర్ధారించుకోకుండానే పలు పత్రికలు ప్రముఖంగా వార్తలను ప్రచురిస్తూ పోలీసు శాఖ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయని నోటీసులలో పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్, టిడిపి నేతలతో పాటు ఆయా పత్రికలు భేషరతుగా క్షమాపణ చెప్పడంతో పాటు, ఆ రిజాంయిండర్ వార్తను ప్రముఖంగా ప్రచురించాలని నోటీసులో పేర్కొన్నారు. లేనిపక్షంలో వారిపై డిజిపి గౌతమ్ సవాంగ్ న్యాయపరమైన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.
Recommended Video
టీడీపీ నేతలు లీగల్ నోటీసులపై ఎలా స్పందిస్తారు ?
మరి ఈ లీగల్ నోటీసులపై తెలుగుదేశం పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తారు అనేది తెలియాల్సి ఉంది. గత కొద్ది రోజులుగా ఏపీ ప్రభుత్వంపై, పోలీసులపై డ్రగ్స్ వ్యవహారంలో సంచలన ఆరోపణలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ తమ ఆరోపణలు అవాస్తవాలని ఒప్పుకుంటుందా? లేక డిజిపి పంపించిన లీగల్ నోటీసులకు న్యాయ మార్గాన్ని ఎంచుకుంటుందా? అనేది తెలియాల్సి ఉంది.