ఏపీ ఎంసెట్ వివరాలు: అదనపు పరీక్షా కేంద్రాల ఏర్పాటు ఈ జిల్లాల్లోనే..
అమరావతి: ఏపీ ఎంసెట్-2020 నోటిఫికేషన్ విడుదలైంది. జేఎన్టీయూ(కాకినాడ) ఈ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఫిబ్రవరి 29 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 20 నుంచి 23 వరకు ఆన్లైన్ ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష.. 23, 24 తేదీల్లో అగ్రికల్చర్ మెడికల్ పరీక్ష జరగనుంది.
Recommended Video
రెండు విభాగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏప్రిల్ 22, 23 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు ఒక స్ట్రీమ్కు రూ.500, రెండు స్ట్రీమ్లకు అయితే రూ.1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎటువంటి ఆలస్య రుసుం లేకుండా మార్చి 29 వరకు.. రూ.500 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 5 వరకు.. రూ.1000 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 10 వరకు, రూ.5000 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 15 వరకు, రూ.10,000 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏప్రిల్ 16 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈసారి ఎంసెట్ దరఖాస్తులోనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు కానుందని అర్హులైన వారు వినియోగించుకోవచ్చని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వి.రవీంద్ర తెలిపారు.
ఎంసెట్ కు సంబంధించిన ఇతర వివరాల కోసం https://sche.ap.gov.in/APSCHEHome.aspx వెబ్ సైట్ సంప్రదించవచ్చని యూనివర్సిటీ వెల్లడించింది.
అదనంగా పరీక్షా కేంద్రాలు..
కాగా, ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎంసెట్ కన్వీనర్ రవీంద్ర తెలిపారు. శుక్రవారం ఆయన ఓ మీడియా ఛానల్తో మాట్లాడుతూ.. గత సంవత్సరం ఉన్న నిబంధనలే ఈ ఏడాది కూడా కొనసాగుతాయన్నారు. అభ్యర్థుల సంఖ్యను బట్టి ఏ రోజు ఏ పరీక్షను నిర్వహించేది త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.
గతంలో కొనసాగించిన పరీక్షా కేంద్రాలనే ఈసారి కొనసాగిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్లో మూడు పరీక్ష కేంద్రాలు ఉంటాయని చెప్పారు. అభ్యర్థుల సంఖ్య పెరుగుతుండటం వల్ల ఈ ఏడాది ప్రకాశం జిల్లా చీమకుర్తి, కృష్ణా జిల్లా తిరువూరు, కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరులో అదనంగా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల సౌలభ్యం కోసం కాల్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications