ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కు డేట్ ఫిక్స్ - లోకేష్ ప్రకటన..!
ఏపీలో నిరుద్యోగులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పై క్లారిటీ వచ్చేసింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కొంతకాలంగా ఊరిస్తూ వస్తున్న ఏపీ ప్రభుత్వం ఇవాళ కీలక ప్రకటన చేసింది. వచ్చే విద్యాసంవత్సరంలోపు ఎట్టి పరిస్ధితుల్లోనూ ఉపాధ్యాయ ఖాళీల్ని భర్తీ చేయాలని టార్గెట్ పెట్టుకున్న విద్యామంత్రి నారా లోకేష్ ఇవాళ ఈ మేరకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై కీలక ప్రకటన చేశారు.
ఏపీలో 16 వేలకు పైగా పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను ఐదు రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ కీలక ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఆర్డినెన్స్ విడుదల తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు లోకేష్ తెలిపారు. దీంతో మెగా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్ధుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఐదు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కాగానే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

వాస్తవానికి గత వైసీపీ ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో ఊరించి చివరకు ఎన్నికలకు ముందు 6 వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చింది. హడావిడిగా టెట్ నిర్వహించి వెంటనే డీఎస్సీ నిర్వహణకు సిద్ధమైపోయింది. దీంతో అభ్యర్ధులు సాంకేతిక కారణాలు చూపుతూ హైకోర్టును ఆశ్రయించారు. అదే సమయంలో ఎన్నికల కోడ్ కూడా ఉండటంతో డీఎస్సీపై ముందుకెళ్లేందుకు ఈసీ అంగీకరించలేదు. చివరికి డీఎస్సీ పరీక్ష నిర్వహించకుండానే వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయింది.
ఎన్నికల సమయంలో మెగా డీఎస్సీ విడుదల చేస్తామని ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నోటిఫికేషన్ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే 9 నెలలుగా నోటిఫికేషన్ మాత్రం విడుదల కాలేదు. దీనికి కారణం ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ఈ తీర్పును రాష్ట్రంలో అమలు చేేయకుండా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వొద్దంటూ గతంలో మందకృష్ణ మాదిగ సీఎం చంద్రబాబును కోరారు. దీంతో నోటిఫికేషన్ చివరి నిమిషంలో వాయిదా పడింది.
ఈ నేపథ్యంలో అభ్యర్ధుల్లో ఆందోళన కూడా పెరుగుతోంది. అయితే వచ్చే విద్య సంవత్సరం ప్రారంభం కల్లా డీఎస్సీ పరీక్ష పూర్తి చేసి ఉపాధ్యాయుల్ని స్కూళ్లలోకి అందుబాటులోకి తేవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇవ్వడంతో నోటిఫికేషన్ విడుదలకు అధికారులు రంగం సిద్దం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications