ఏపీ సర్కార్ కు తేల్చేసిన ఉద్యోగ సంఘాలు-చంద్రబాబు కోర్టులోకి బంతి..!
ఏపీలో ఇవాళ ఉద్యోగ సంఘాలతో మంత్రులు జరిపిన చర్చలు పూర్తయ్యాయి. అమరావతి సచివాలయంలో ఇవాళ ఉద్యోగ సంఘాలను తొలిసారి చర్చలకు ఆహ్వానించిన మంత్రుల కమిటీ.. సుదీర్ఘంగా వారి వాదనలు తీసుకుంది. అలాగే ప్రభుత్వ ఆర్ధిక ఇబ్బందులను కూడా వారికి వివరించింది. అనంతరం ఉద్యోగ సంఘాలు చెప్పిన విషయాలను సీఎం చంద్రబాబుకు వివరించి వారికి దీపావళి కానుక ఇప్పించేందుకు సిద్దమవుతోంది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వివిధ పెండింగ్ అంశాలపై ఎపి సచివాలయం 5వ భవనంలో మంత్రుల బృందం(జిఓఎం)ఆధ్వర్యంలో ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. మంత్రులు పయ్యావుల కేశవ్,నాదెండ్ల మనోహర్,సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డిఏలు సహా ఇతర అంశాలపై మంత్రుల బృందం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించింది.

మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తి సానుకూలంగా, మానవతా దృక్పదంతో ఉన్నారని స్పష్టం చేశారు. ఆర్ధికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమైనందున ఉద్యోగుల సమస్యలను తగిన రీతిలో పరిష్కరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని స్పష్టం చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై గురువారం సియం ప్రత్యేకంగా మూడు గంటలపాటు మంత్రుల బృందం,అధికారులుతో చర్చిచండం జరిగిందని తెలిపారు. మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఆర్ధికపరైన అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సియం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించిన అంశాలను పరిష్కరించే దిశలో ప్రభుత్వం తగిన కసరత్తు చేస్తోందని తెలిపారు.అందుకు సంబంధించి ఇప్పటికే జెఎస్సి సమావేశం నిర్వహించగా మరలా మంత్రుల బృందం సమావేశం ద్వారా ఉద్యోగుల సమస్యలన్నిటనీ తెల్సుకోవడం జరిగిందని అన్నారు. సాయంత్రం ముఖ్యమంత్రి వర్యుల క్యాంపు కార్యాలయంలో సియం మంత్రుల బృందం,అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించనున్నారని ఈ సమావేశానికి ఉద్యోగ సంఘాల అధ్యక్షులు కూడా హాజరు కావాలని కోరారు.
మరోవైపు ఈ మీటింగ్ కు హాజరైన ఉద్యోగ సంఘాల నేత సూర్యనారాయణ కనీసం రెండు డీఏ లు ఇమ్మని అడిగామన్నారు.
ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు ప్రభుత్వం వివరించిందని, అయితే రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో పే రివిజన్ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరామని తెలిపారు. హెల్త్ కార్డులకు సంబంధించి కూడా వెంటనే క్లియర్ చేయాలని కోరినట్లు వెల్లడించారు. ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ.. 5 సంవత్సరాలుగా టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలఫై చర్చించామన్నారు. ఉద్యోగులకి సంబంధించిన సమస్యలు తేల్చాలని కోరామన్నారు.
పెన్షనర్స్ కి అడిషనల్ క్వాంటం ఆఫ్ బెనిఫిట్స్, పదవీ విరమణ బెనిఫిట్స్ ఇవ్వవలసిందిగా కూడా కోరారు. పెండింగ్ ఉన్న 4 డీఏ లను చెల్లించాలని కోరామని, PRC కమిటీ చైర్మన్ ను నియమించాలని కోరామని తెలిపారు. అలాగే హెల్త్ కార్డు లను సిస్టమైజ్ చేయమని కోరినట్లు తెలిపారు. దీంతో పాటు మరికొంత మందికి 62 సంవత్సరాల పదవి విరమణ కొనసాగించాలని, పెండింగ్ ఉన్న 7 వేల మంది ఔట్ సోర్స్ ఉద్యోగులని రెగ్యులరైజ్ చేయాలని, పోలీసు సిబ్బంది సరెండర్ లీవ్, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని, కారుణ్య నియామకాలు పూర్తి చేయాలని, 15 నెలల నుంచి మేం పడుతున్న ఇబ్బందులను దీపావళి సందర్భంగా తీర్చాలని కోరినట్లు విద్యాసాగర్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications