ఉద్యోగుల పోరు మళ్లీ మొదటికి- పీఆర్సీ ఫిట్ మెంట్ పై యూటర్న్ ? క్షేత్రస్ధాయిలో పరిస్ధితులతో !
ఏపీలో ఉద్యోగుల పీఆర్సీ పోరు తీవ్రమవుతోంది. ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోలపై అసంతృప్తిగా ఉన్న ఉద్యోగులు సమ్మె నోటీసు కూడా ఇచ్చారు. అయితే ప్రభుత్వం ఫిట్ మెంట్ కు బదులుగా హెచ్ఆర్ఏపై చర్చలు జరుపుతామని చెప్తున్న నేపథ్యంలో పీఆర్సీ ఫిట్మెంట్ పైనే పట్టుబట్టాలని ఉద్యోగులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో గతంలో తాము అంగీకరించిన దానికి భిన్నంగా మెరుగైన ఫిట్ మెంట్ కు డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి.

ఉద్యోగుల యూటర్న్
పీఆర్సీ ఫిట్ మెంట్ విషయంలో గతంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ తో చర్చలు జరిపి 23 శాతం ఫిట్ మెంట్ తీసుకునేందుకు అంగీకరించిన ఉద్యోగులు.. ఇప్పుడు మాటమారుస్తున్నారు. గతంలో అంగీకరించిన ఫిట్ మెంట్ శాతంపై మళ్లీ విమర్శలకు దిగుతున్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంత దారుణంగా ఫిట్ మెంట్ శాతం ప్రకటించారని ఆరోపిస్తున్న ఉద్యోగులు.. ఇంత తక్కువ ఫిట్ మెంట్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. అసలు ఏ లెక్కల ప్రకారం పీఆర్సీ ప్రకటించారని ఏపీ ఎన్జీవోల నేత, పీఆర్సీ సాధనసమితిలో సభ్యుడైన బండి శ్రీనివాసరావు ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఫిట్ మెంట్ ఇంత తగ్గిస్తారని అనుకోలేదన్నారు.

జగన్ ముందు అంగీకరించి.. ఇప్పుడు
సీఎం జగన్ తో జరిగిన చర్చల సందర్భంగా పీఆర్సీ ఫిట్ మెంట్ శాతం అధికారుల కమిటీ ఇచ్చిన 14.29 కంటే మెరుగ్గా 23 శాతం ఇస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి అప్పట్లో ఉద్యోగసంఘాల తరఫున చర్చలకు వెళ్లిన పీఆర్సీ సాధన సమితి నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, వెంకట్రామిరెడ్డి అంగీకరించారు. అంతే కాదు సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు కూడా చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం పీఆర్సీ శాతం అసలు ఎలా నిర్ణయించారని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఉద్యోగుల తీరు వివాదాస్పదమవుతోంది.
Recommended Video

క్షేత్రస్ధాయిలో పోరే కారణమా ?
ఉద్యోగసంఘాల నేతలు ఒప్పుకున్న పీఆర్సీ ఫిట్ మెంట్ 23 శాతమే. అయితే ప్రభుత్వం దీన్ని అడ్డుపెట్టుకుని డీఏల్ని కూడా కలిపేసి ఇప్పుడు జీతాలు పెరిగాయా, తగ్గాయా అని ప్రశ్నిస్తోంది. దీనంతటికీ మూలకారణం ఐఆర్ 27 శాతం నాలుగు శాతం తక్కువగా 23 శాతం ఫిట్ మెంట్ కు ఉద్యోగనేతలు అంగీకరించడమే. దీంతో ఇప్పుడు క్షేత్రస్ధాయిలో ఉద్యోగులు కూడా ఇప్పుడు ఉద్యోగ నేతల్ని అదే ప్రశ్నలు వేస్తున్నారు. దీంతో వారికి నచ్చజెప్పలేక, అలాగని తమ నిర్ణయాన్ని సమర్ధించుకోలేక వారు యూటర్న్ తీసుకుంటున్నట్లు అర్ధమవుతోంది. అందుకే పీఆర్సీ ఎలా ఖరారు చేశారంటూ ఇప్పుడు ప్రభుత్వాన్ని వారు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా పీఆర్సీ శాతాన్ని మళ్లీ ఖరారు చేయమని కోరుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఉద్యోగ నేతల్ని ఇరుకునపెట్టేందుకు యూటర్న్ విషయాన్ని బలంగా తెరపైకి తెస్తోంది.












Click it and Unblock the Notifications