పీఆర్సీ కోసం ఉద్యోగ సంఘాల పట్టు-అయిదున్నార గంటల నిరీక్షించినా.. : నేడు కార్యాచరణ ఖరారు..!!
ఏపీలో ఉద్యోగ సంఘాల నుంచి పీఆర్సీ కోసం ఒత్తిడి పెరుగుతోంది. పీఆర్సీ అమలు ఆలస్యం అవుతున్న పరిస్థితుల్లో తమకు పీఆర్సీ నివేదిక ఇవ్వాలంటూ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీని కోసం వెలగపూడిలోని సచివాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అయిదున్నార గంటల పాటు నిరీక్షించారు. ఏపీ ఉద్యోగ సంఘాలు కొంత కాలంగా పీఆర్సీతో పాటుగా పెండింగ్ డీఏలు అమలు చేయాలని... సీపీఎస్ రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నాయి. దీని పైన ప్రభుత్వ సలహాదారు సజ్జలతో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశం అయ్యారు.

సచివాలయంలో ఉద్యోగ నేతల నిరీక్షణ
ఆ సమయంలో అక్టోబర్ నెలాఖరులోగా పీఆర్సీ సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వం నుంచి హామీ వచ్చింది. కానీ, అమలు కాలేదు. ఇదే సమయంలో గత నెల 29న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగినప్పుడు పీఆర్సీ నివేదికను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు పట్టుబట్టాయి. వారంలో విడుదల చేస్తామని సీఎస్ సమీర్ శర్మ ఆనాడు హామీ ఇచ్చారు. ఆ తరువాత ప్రభుత్వం నుంచి దీని పైన స్పందన లేదు. బుధవారం సీఎంతో చర్చించి..నివేదిక ఇస్తామని సీఎస్ ఉద్యోగ సంఘాలకు చెప్పారు. దీంతో..ఉద్యోగ సంఘాల నేతలు సీఎస్ వద్దకు వచ్చారు.

అయిదున్నార గంటలు వేచి చూసినా
అయితే, ఆయన జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్ ఇస్తారని, వేచిచూడాలని చెప్పటంతో సచివాలయంలోనే ఉద్యోగ సంఘాల నేతలు నిరీక్షించారు. సీఎంను కలవడానికి సీఎస్ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లిపోవడంతో పీఆర్సీ నివేదిక రావచ్చని వారు భావించారు. ఈలోపు అక్కడి నుంచి వెళ్లిపోవాలని భద్రతా సిబ్బంది వారికి సూచించారు. దీంతో నేతలు అక్కడి నుంచి మూడో బ్లాక్ ఎదురుగా ఉన్న పార్కులోకి వచ్చి బైఠాయించారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 9:20 వరకు ఎదురు చూశారు. ప్రభుత్వం నుంచి కనీసం మాచారమైనా వస్తుందేమో, చర్చలకు పిలుస్తారేమోనని ఆశించారు.

సీఎంతో సీఎస్ సమావేశం
కానీ అలాంటివేమీ జరగలేదు. సచివాలయ భద్రతా సిబ్బంది వారిని వెళ్లాల్సిందిగా కోరారు. ఈలోపు ఉద్యోగ సంఘాల నేతలతో శశిభూషణ్ సంప్రదింపులు జరుపుతారని రాత్రి 9 గంటల సమయంలో సీఎస్ నుంచి సమాచారం వచ్చింది. దీంతో తాము శశిభూషణ్కు తాము ఫోన్ చేస్తే ఎత్తలేదని నేతలు వాపోయారు. ఈ రోజు తమ కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేసారు. పీఆర్సీ నివేదికను దాచిపెట్టడం, సీల్డ్ కవర్లో పెట్టడం విచిత్రంగా ఉద్యోగ సంఘాల నేతలు వ్యాఖ్యానించారు.

ఏ హామీ అమలు కావటం లేదంటూ
ఈ ప్రభుత్వం రావాలని మేం కూడా కుడి చేత్తో, ఎడమ చేత్తో ఓట్లేశాం. మేం సానుకూల ధోరణితో సహకరిస్తుంటే.. అధికారుల అలసత్వమో, ఈ ప్రభుత్వ తీరే ఇలా ఉందో అర్థం కావడంలేదు. ఉద్యోగులను చిన్న చూపు చూస్తున్నట్లు భావించాల్సి ఉంటుందంటూ వ్యాఖ్యానించారు. ఉద్యోగులకు ఆర్ధికపరమైన బిల్లులు ఏవీ రావడం లేదని, రీయింబర్స్మెంట్ పేమెంట్లు కూడా ఇవ్వడం లేదని, ఉద్యోగుల హెల్త్కార్డులు ఏ ఆస్పత్రిలోనూ చెల్లడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వానికి తాము సానుకూలంగా ఉన్నా.. ఉన్నతాధికారులు తమ పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు.

కార్యాచరణ ప్రకటన కోసం సమావేశం
ప్రభుత్వం మంచి మనసుతో ఉద్యోగుల బాధలను అర్థం చేసుకోవాలని కోరారు. పీఆర్సీపై ఏం చేస్తున్నారో తెలియజేసి, నివేదికను తమకు అందజేయాలని డిమాండ్ చేశారు.పీఆర్సీ విషయంలో ప్రభుత్వ తీరుతో ఉద్యోగులు మానసిక క్షోభకు గురవుతున్నారని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. నివేదిక విడుదలను తరచూ వాయిదాలు వేస్తున్నా.. రెండు నెలలుగా తాము సహనంతో ఎదురుచూస్తున్నామని, మా ఉద్యోగులకు సంబంధించిన నివేదికను మాకు ఇవ్వడానికి ప్రభుత్వానికి బాధేందో తెలియడం లేదన్నారు.
Recommended Video

ప్రభుత్వం స్పందిస్తుందా
ఉద్యోగులపై ప్రభుత్వానికి ప్రేమలేదన్నారు. ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య అధికారులే దూరం పెంచుతున్నారని ఆరోపించారు. ఇక, ఈ రోజు (గురువారం) ఉద్యోగ సంఘాల నేతలు సమావేశం కానున్నారు. కార్యాచరణ ప్రకటించేందుకు సిద్దం అవుతున్నారు. ఈ లోగా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వస్తుందనేది చూడాల్సి ఉంది. ఇదే సమయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల ఇప్పటికే పీఆర్సీ పైన కసరత్తు ప్రారంభమైందని..చెప్పిన సమయం కంటే కొంత ఆలస్యం అయిందంటూ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications