రాజధాని అన్యాయంపై స్పందించండి: పవన్ కళ్యాణ్కి రైతుల వినతి
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ వద్ద ఆంధ్రప్రదేశ్ రైతులు తమ గోడును వెల్లబోసుకున్నారు. ప్రతీయేటా మూడు పంటలు పండే తమ విలువైన భూములను ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకుంటోందని, దీనిపై తమకు న్యాయం జరిగేలా చూడాలని ఏపి రాజధాని ప్రాంత రైతులు కోరారు.
భూములు ఇవ్వబోమన్న రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని రైతులు ఆయనకు వివరించారు. గత సాధారణ ఎన్నికల్లో మీరు చెప్పిన మేరకు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలకు ఓటు వేశామని రైతులు పవన్ కళ్యాణ్కు గుర్తు చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులపై స్పందించాలని రైతులు పవన్ను కోరారు. అన్యాయం ఎక్కడ, ఎప్పుడు జరిగినా ప్రశ్నిస్తానని చెప్పిన మీరు ఇంతమంది ప్రజలు, రైతులు, కూలీలకు అన్యాయం జరుగుతున్నా ప్రశ్నించకపోవడం మంచిది కాదని వారు ఆయన తెలిపారు.
రైతులు చెప్పిన సమస్యలను పవన్ సావధానంగా విన్నారు. రాజకీయాల గురించి 2017 వరకు మాట్లాడననని, అయితే ప్రజల ఇబ్బందులపై సరైన సమయంలో స్పందిస్తానని చెప్పారు. పవన్ కళ్యాణ్ని కలిసిన వారిలో యర్రబాలెం, ఉండవల్లి గ్రామాలకు చెందిన రైతులున్నారు. కాగా, రాష్ట్రంలో రైతాంగం రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై పవన్ ప్రాంతాల వారీగా సదస్సులు నిర్వహించనున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications