బాబుకు వ్యతిరేకంగా హజారేను కలవనున్న రైతులు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేస్ రాజధాని ప్రాంతంలో భూసమీకరణకు వ్యతిరేకత చూపుతున్న పలువురు రైతులు సంఘసంస్కర్త అన్నాహజారే మద్దతు కోరేందుకు సిద్ధమయ్యారు. ఏపీ రాజధాని కోసం రాష్ట్ర ప్రభుత్వం భూసమీకరణ చేపట్టిన విషయం తెలిసిందే. రైతుల నుండి భూములను బలవంతంగా లాక్కుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు హైకోర్టుకు కూడా వెళ్లారు.
తాజాగా మరికొందరు రైతులు అన్నాహజారే మద్దతు కోరేందుకు సిద్ధమయ్యారు. అవినీతి వ్యతిరేక ఉద్యమంతో గత యూపీఏ ప్రభుత్వాన్ని ఒక కుదుపు కుదిపిన అన్నాహజారే ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ఢిల్లీలో ఉద్యమిస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం భూసేకరణ చట్టానికి సవరణలు చేస్తూ ఇటీవల జారీ చేసిన ఆర్డినెన్స్ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ హజారే ఇక్కడి జంతర్మంతర్ వద్ద రెండు రోజుల ధర్నాకు సోమవారం శ్రీకారం చుట్టారు. ఇది భూములు లాక్కునే ప్రభుత్వమని, బ్రిటీష్ వారు కూడా ఇలాగే చేశారని, ఈనాటి ప్రభుత్వం బ్రిటీష్ వారికన్నా ఘోరంగా ఉందని, బ్రిటీష్ వారు కూడా రైతులకు ఇంత అన్యాయం చేయలేదని హజారే నిందించారు.
కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ను వ్యతిరేకిస్తున్న అన్నాహజారే, తమకు కూడా అండగా నిలబడతారని ఆశిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాంతానికి చెందిన పలువురు రైతులు ఆయనను కలిసి మద్దతు కూడగట్టేందుకు సిద్ధమయ్యారు. కాగా, నాడు అన్నాహజారే అవినీతి వ్యతిరేక ఉద్యమానికి నాడు చంద్రబాబు కూడా మద్దతు పలికారు.












Click it and Unblock the Notifications