బాబుXకెసిఆర్ : తెలంగాణపై సుప్రీంకోర్టుకు ఏపీ రైతులు
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన పాలమూరు - రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల పైన ఆంధ్రప్రదేశ్ రైతులు సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఏపీలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లా రైతులు కొందరు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
తెలంగాణ ప్రభుత్వం అనుమతులు లేకుండా ప్రాజెక్టులు చేపడుతోందని వారు తమ పిటిషన్లో పేర్కొన్నారు. సుప్రీం కోర్టు వారి పిటిషన్ స్వీకరించింది. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు ఎలా కడుతున్నారని ప్రశ్నించింది. ఉమ్మడి ఏపీలో ప్రారంభించిన పథకాలేనని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది.
రైతుల ఫిర్యాదు నేపథ్యంలో పిటిషన్ స్వీకరించిన సుప్రీం కోర్టు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం రెండు వారాల గడువు కోరింది. దీంతో తదనంతర విచారణను ప్రభుత్వం జూలై 20వ తేదీకి వాయిదా వేసింది.
కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం జరుగుతోన్న విషయం తెలిసిందే. కృష్ణా, గోదావరి నదుల పైన తెలంగాణ ప్రభుత్వం సీడబ్ల్యుసీ అనుమతి లేకుండా ప్రాజెక్టులు కడుతోందని, చంద్రబాబు మండిపడుతుండగా, తాము నిబంధనల మేరకే నిర్మిస్తున్నామని కెసిఆర్ చెబుతున్నారు.
మధ్యలో, వైసిపి అధినేత జగన్.. తెలంగాణ తీరును తప్పుబడుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కార్నర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు పెద్దగా పెదవి విప్పడం లేదు. మొత్తానికి, తెలంగాణ - ఏపీ మధ్య విభజన తర్వాత కూడా జల జగడం కనిపిస్తోంది.
రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికే పలు అంశాల్లో ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలు ఉన్నాయి. ఉద్యోగుల విభజన వంటివి ఎన్నో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓటుకు నోటు తెరపైకి వచ్చింది. ఇరువురి మధ్య విభేదాలు వచ్చాయి. ఆ తర్వాత దోస్తీ కుదిరింది. ఇప్పుడు ప్రాజెక్టుల విషయంలో మరోసారి ఇరురాష్ట్రాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.