సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ షాక్- రేపటి నుంచి బయోమెట్రిక్ తప్పనిసరి
ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల్లో దాదాపు లక్షా 30 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి బయోమెట్రిక్ విధానంలో హాజరు తీసుకోవాలని ప్రభుత్వం గతంలోనే భావించింది. అయితే పలు కారణాలతో ఇధి సాధ్యం కాలేదు. మధ్యలో కరోనా సమస్యలు రావడం, బయోమెట్రిక్ హాజరుకు ఉద్యోగులు సిద్ధంగా లేకపోవడంతో ప్రభుత్వ నిర్ణయం అమలు కాలేదు.
Recommended Video
ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు రేపటి నుంచి బయోమెట్రిక్ విధానంలోనే హాజరు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బమోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సచివాలయాల్లో బయోమెట్రిక్ హాజరు లేకపోవడంతో ఉద్యోగులు పూర్తి పనిగంటలు విధుల్లో ఉండడం లేదన్న ఫిర్యాదులు ఉన్నాయి. అసలే ప్రభుత్వం సంక్షేమ పథకాలన్నీ సచివాలయాల ద్వారానే అమలు చేయిస్తున్న నేపథ్యంలో ఉద్యోగులు అందుబాటులో లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు బయోమెట్రిక్ విధానంలో హాజరు తీసుకోవాలని ఏడాది క్రితమే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా అది అమలు కాలేదు. మధ్యలో కరోనా రావడంతో ఉద్యోగులు బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో ఎప్పటిలాగే అటెండెన్స్ రిజిస్టర్ లో హాజరు నమోదు చేస్తున్నారు. తాజాగా కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో ప్రభుత్వం బయోమెట్రిక్ హాజరును జూలై 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో ఉద్యోగులు తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరునే నమోదు చేయాల్సిన పరిస్ధితి ఏర్పడింది.