ఉద్యోగుల ఉద్యమం ఎందుకో ? పీఆర్సీ బకాయిలపై 16న నిర్ణయం-సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి కామెంట్స్
ఏపీలో పెండింగ్ సమస్యలపై ఉద్యోగులతో చర్చలు జరిపిన తర్వాత కూడా ఉద్యమాలు చేయడంపై ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఏపీలో ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదని ఆరోపిస్తూ ఏపీ జేఏసీ అమరావతి ఇవాళ్టి నుంచి ఉద్యమం చేపట్టింది. ప్రభుత్వంతో తాజాగా చర్చలు జరిపిన తర్వాత కూడా సరైన ఫలితం రాలేదని ఆరోపిస్తూ ఇవాళ నల్ల రిబ్బన్లతో నిరసనలకు దిగింది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల నిరసనలపై ఉద్యోగుల సంక్షేమ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు.
సీపీఎస్ రద్దు విషయంలో ప్రభుత్వం సానుకూలతతో ఆలోచిస్తోందని ఉద్యోగుల వ్యవహారాల సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఓపీఎస్ విధానం ద్వారా కలిగే లబ్దికి సమానమైన లబ్దిని కలిగించే కొత్త విధానంపై ప్రభుత్వం చర్చిస్తోందన్నారు.ఈ నెలాఖరులోగా పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని ఆయన గుర్తుచేశారు. ఒకటో తేదీన జీతాలు చెల్లించే విషయంలో జాప్యం వాస్తవమేనని చంద్రశేఖర్ రెడ్డి అంగీకరించారు.

ప్రభుత్వంలో తాజాగా అదనంగా రెండున్నర లక్షలకు పైగా ఉద్యోగులు చేరారని, దీంతో జీతాల భారం పెరిగిందన్నారు.ఓన్ సోర్సెస్ నుంచి నెలకు రూ. 1.25 లక్షల మేర ఆదాయం ప్రభుత్వానికి వస్తుంటే.. రూ. 90 వేల కోట్లు జీతాలకే సరిపోతుందన్నారు. ఈ నెల 16వ తేదీన పీఆర్సీ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి వస్తుందని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నిన్నటి చర్చల్లో ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కూడా చర్చల్లో సంతృప్తి వ్యక్తం చేశారని ఆయన గుర్తుచేశారు. మరి ఉద్యమాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారో తెలియడం లేదన్నారు.












Click it and Unblock the Notifications