దమ్ముంటే విచారణ సవాళ్లేల ? అరెస్టు చేస్తే బీసీ రంగులేల ? టీడీపీకి సజ్జల సూటి ప్రశ్నలు...
ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టుపై టీడీపీ నేతలు చేస్తున్న కక్షసాధింపు ఆరోపణలకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. టీడీపీ నేతలు గతంలో మాట్లాడిన మాటలను, ప్రస్తుతం అచ్చెన్నాయుడు అరెస్టు తర్వాత మాట్లాడుతున్న మాటలను కోట్ చేస్తూ సజ్జల తాజాగా చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. టీడీపీ నేతల ద్వంద వైఖరిని బయటపెట్టేలా ఉన్న ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
గతంలో టీడీపీ నేతలపై వైసీపీ ఆరోపణలు చేసినప్పుడు దమ్ముంటే వాటిపై విచారణ జరిపాలని, నిరూపించాలని ఆ పార్టీ సవాళ్లు విసిరేది. కానీ తాజాగా ఈఎస్ఐ స్కామ్ లో విజిలెన్స్, ఏసీబీ దర్యాప్తు తర్వాత అచ్చెన్నాయుడును అరెస్టు చేశాక ఇది వైసీపీ కక్షసాధింపుగా అభివర్ణిస్తోంది. ఇదే అంశంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ ట్వీట్ చేశారు. గత ప్రభుత్వంలో అవినీతిని ప్రస్తావిస్తున్నప్పుడు దమ్ముంటే విచారణ చేయమని, చేతనైతే కేసులు పెట్టమని చంద్రబాబు మాట్లాడతారని, ఈఎస్ఐ కుంభకోణంలో పక్కా ఆధారాలతో అచ్చెన్నాయుడిపై ఏసీబీ దర్యాప్తు చేస్తుంటే మాత్రం రాజకీయ కక్ష అంటున్నారని, బీసీ రంగులు అద్దుతున్నారని తన ట్వీట్లో సజ్జల ఆరోపణలు చేశారు.
మరో ట్వీట్లో సజ్జల అచ్చెన్నాయుడు అరెస్ట్ తొలి అడుగు మాత్రమేనన్నారు. రివర్స్ టెండరింగ్ తో రూ.2200 కోట్లు ఆదా ద్వారా అప్పట్లో ఎంతటి అవినీతికి పాల్పడ్డారో బయటపెట్టాక చర్యలు తీసుకోవడంలో తప్పేముందని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు అరెస్టు ఈ దిశగా ప్రభుత్వం వేసిన తొలి అడుగు మాత్రమేనని సజ్జల తెలిపారు. తద్వారా భవిష్యత్తులో మరింత మంది అవినీతికి పాల్పడిన టీడీపీ నేతలపై చర్యలు తప్పవనే హెచ్చరికలు చేసినట్లయింది.