ఏపీలో రిజిస్ట్రేషన్లపై గుడ్ న్యూస్-రేపటి నుంచి ఈ సేవలు..!
ఏపీలో ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నా, పేర్లు మార్చుకోవాలన్నా, ఇతర సేవలు పొందాలన్నా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల వద్ద పడిగాపులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రేపు దీన్ని అధికారికంగా ప్రారంభించబోతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. దీంతో రిజిస్ట్రేషన్లు చేసుకునే వారికి సమయం ఆదా కాబోతోంది.
రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల కోసం నేరుగా వచ్చి పడిగాపులు పడే కంటే ముందుగానే స్లాట్ బుకింగ్ చేసుకుని వచ్చే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం రేపు స్లాట్ బుకింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తోంది. దీని ప్రకారం ఆన్ లైన్ లోనే రిజిస్ట్రేషన్ సేవల కోసం ముందుగా స్లాట్ బుక్ చేసుకుని ఎంచుకున్న సమయం ప్రకారం సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు వెళ్లే అవకాశం కలగబోతోంది.

రేపటి నుంచి ఏపీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఈ స్లాట్ బుకింగ్ ప్రక్రియ అమల్లోకి రాబోతోంది. రేపు ఉదయం 10 గంటలకు అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ .. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఆన్లైన్ స్లాట్ బుకింగ్ చేసే ప్రక్రియను ప్రారంభిస్తారు. దీంతో రేపటి నుంచి 26 జిల్లాల ప్రధాన కార్యాలయాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.












Click it and Unblock the Notifications