ఆ ఉద్యోగులకు జగన్ సర్కార్ భారీ ఊరట..!
ఏపీలో ఎన్నికల వేళ ఉద్యోగుల్లో అసంతృప్తిని తొలగించేందుకు పలు ఆర్ధిక పరమైన నిర్ణయాలు తీసుకుంటున్న వైసీపీ సర్కార్.. ఇప్పుడు తాజాగా మరో అంశంలో కీలక నిర్ణయం తీసుకుంది.
గతంలో ఎప్పటి నుంచో ఉద్యోగులు కోరుతున్న ఓ అంశంపై స్పందించి ఎన్నికల నేపథ్యంలో భారీ ఊరటనిచ్చింది. దీంతో ఉద్యోగుల డిమాండ్లలో మరొకటి నెరవేరినట్లయింది. దీంతో ఆయా ఉద్యోగ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై పలు సందర్భాల్లో ఏసీబీ, విజిలెన్స్ సహా పలు ఇతర దర్యాప్తు సంస్ధలు అవినీతి కేసులు నమోదు చేస్తన్నాయి. లంచాలు తీసుకుంటూ పట్టుబడటం, ఫిర్యాదులపై విచారణ సందర్భంగా ఆరోపణలు రుజువు కావడం జరిగినప్పుడు ఆయా ఉద్యోగులపై గరిష్టంగా రెండేళ్ల వరకూ సస్పెన్షన్ విధిస్తున్నారు. కేసుల్లో చిక్కుకున్న ఉద్యోగులకు దీంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఆ సస్పెన్షన్ ను తొలగించుకునేందుకు వారు తిరిగి ఉన్నతాధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
ఇప్పుడు ప్రభుత్వం ఇలా అవినీతి కేసుల్లో చిక్కుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు శాఖాపరంగా విధిస్తున్న రెండేళ్ల సస్పెన్షన్ ను ఏడాదికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే ఇప్పుడు ఓ ప్రభుత్వ ఉద్యోగి అవినీతి కేసుల్లో పట్టుబడి, నేరం రుజువైనా ఏడాదికి మించి సస్పెన్షన్ విధించడానికి వీల్లేదన్నమాట. దీంతో ఇప్పటికే అవినీతి కేసుల్లో చిక్కుకుని ఏడాదికి పైగా సస్పెన్షన్ వేటు ఎదుర్కొంటున్న వారితో పాటు కొత్తగా నమోదు చేసే కేసుల్లోనూ ఇది వర్తించబోతోంది.
ఉద్యోగులు గత ఐదేళ్లుగా ప్రభుత్వం ఆర్ధికపరంగా తీసుకుంటున్న నిర్ణయాలపై అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా డీఏల పెండింగ్, ఇతర ప్రయోజనాలు కూడా సకాలంలో కల్పించకపోవడం, జీతాలు సకాలంలో చెల్లించకపోవడం వంటి పలు కారణాలతో వారిలో ఉన్న అసంతృప్తి పతాక స్ధాయికి చేరుతోంది. తాజాగా పీఆర్సీ ఇచ్చే వరకూ ఐఆర్ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం అంగీకరించకపోవడం కూడా వారిలో ఆగ్రహం నింపింది. దీంతో ప్రభుత్వం గతంలో ఎప్పటి నుంచో వారు కోరుతున్న అవినీతి ఉద్యోగుల సస్పెన్షన్ కాలం తగ్గింపు డిమాండ్ ను నెరవేర్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications