మండలిలో రామసుబ్బారెడ్డికి విప్: ఇద్దరికీ ప్రాధాన్యత, ఆదికి చెక్?
మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి టిడిపిలో మంచి రోజులు వచ్చినట్టు కన్పిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఓటమి పాలైన రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు.
కడప: మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి టిడిపిలో మంచి రోజులు వచ్చినట్టు కన్పిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఓటమి పాలైన రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. అంతేకాదు శాసనమండలిలో విప్ పదవిని కట్టబెట్టాలని చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో ఫ్యాక్షన్ గొడవలకు జమ్మలమడుగు నియోజకవర్గం పేరొందింది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, టిడిపి వర్గీయుల మధ్య ఫ్యాక్షన్ హత్యలు చోటు చేసుకొన్నాయి.
రామసుబ్బారెడ్డి బాబాయ్ శివారెడ్డికి, మంత్రి ఆదినారాయణరెడ్డి తండ్రుల మధ్య ఆధిపత్యపోరు సాగింది. ఈ పోరులో పలు హత్యలు చోటుచేసుకొన్నాయి. ఆదినారాయణరెడ్డి కుటుంబం కాంగ్రెస్ నుండి వైసీపీలోకి. వైసీపీ నుండి టిడిపిలోకి చేరింది. రామసుబ్బారెడ్డి కుటుంబం మొదటి నుండి టిడిపిలోనే కొనసాగుతోంది.మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆదినారాయణరెడ్డి టిడిపిలోకి రావడాన్ని రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ, పార్టీ అవసరాల రీత్యా ఆదినారాయణరెడ్డిని టిడిపిలో చేర్చుకోవాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.

రామసుబ్బారెడ్డికి టిడిపిలో మంచి రోజులు
ఆదినారాయణరెడ్డి వైసీపీ నుండి టిడిపిలో చేరడాన్ని రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీలో చేర్చుకోవడమే కాకుండా ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవిని కూడ కట్టబెట్టారు. అయితే ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవిని కట్టబెట్టడంతో రామసుబ్బారెడ్డి వర్గీయులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఒకానొక దశలో రామసుబ్బారెడ్డి పార్టీని వీడుతారనే ప్రచారం కూడ సాగింది. అయితే మహనాడుకు కూడ రామసుబ్బారెడ్డి డుమ్మాకొట్టారు.దీంతో ఆయనను చంద్రబాబునాయుడు పిలిపించి మాట్లాడారు.ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. శాసనమండలిలో విప్ పదవిని కట్టబెట్టాలని నిర్ణయం తీసుకొన్నారు.. రామసుబ్బారెడ్డికి మంచి రోజులు వచ్చాయని ఆయన అనుచరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే అధికారికంగా ఉత్తర్వులు రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉంది.

జమ్మలమడుగులో ఆ ఇద్దరికి ప్రాధాన్యత
జమ్మలమడుగు నియోజకవర్గంలో మంత్రి ఆదినారాయణరెడ్డికి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగానే క్యాబినెట్ మంత్రి స్థాయి పదవిని రామసుబ్బారెడ్డికి కట్టబెట్టాలని నిర్ణయం తీసుకొన్నారు. రామసుబ్బారెడ్డి ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆదినారాయణరెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకొన్నందున రామసుబ్బారెడ్డికి కూడ మండలిలో విప్ పదవిని కట్టబెట్టాలని నిర్ణయం తీసుకొన్నారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి..ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఉండడంతో రామసుబ్బారెడ్డి వర్గీయులు కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. అంతేకాదు మంత్రి హోదా కలిగిన విప్ పదవిని కట్టబెట్టడం ద్వారా ఆదితో సమాంతరంగా పార్టీలో ప్రాధాన్యత ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

సర్పంచ్ నుండి మంత్రి పదవులు నిర్వహించిన రామసుబ్బారెడ్డి
బాబాయ్ శివారెడ్డి కారణంగానే రామసుబ్బారెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. కడప జిల్లాలో శివారెడ్డికి మంచి గుర్తింపు ఉండేది. జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో శివారెడ్డి బతికున్నంతకాలం టిడిపికి ఎదురులేకుండాపోయింది. శివారెడ్డిని ప్రత్యర్థులు చంపేశారు. దీంతో రామసుబ్బారెడ్డి రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేశారు.
1987లో మొదటిసారిగా రామసుబ్బారెడ్డి గుండ్లకుంట సర్పంచ్గా ఎన్నికయ్యారు. 1993లో శివారెడ్డి హత్యకు గురికావడంతో 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మలమడుగు నుండి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి రామసుబ్బారెడ్డి గెలుపొందారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎన్టీఆర్ మంత్రివర్గంలో అటవీశాఖ మంత్రిగా బాధ్యతలను నిర్వహించారు. 1999లో జరిగిన ఎన్నికల్లో కూడ రామసుబ్బారెడ్డి విజయం సాధించారు. ఆ సమయంలో గృహనిర్మాణశాఖ మంత్రిగా పనిచేశారు. ప్రత్యర్థులను హత్య చేశారనే ఆరోపణల విషయమై కోర్టు కేసు కారణంగా రామసుబ్బారెడ్డి జైలు జీవితాన్ని కూడ గడిపారు.

కడప జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన రామసుబ్బారెడ్డి
2004 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో రామసుబ్బారెడ్డి ఆదినారాయణరెడ్డి చేతిలో ఓటమిపాలౌతున్నారు. 1996 నుండి 1998 వరకు రామసుబ్బారెడ్డి టిడిపి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. తొలి నుండి రామసుబ్బారెడ్డి కుటుంబం టిడిపిని అంటిపెట్టుకొని ఉండడంతో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆయనకు ప్రాధాన్యత ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications