నవ్యాంధ్ర భద్రాద్రి ఒంటిమిట్ట: వేడుకలకు ముస్తాబు
హైదరాబాద్: ఏపీ శ్రీరామనవమి వేడుకలతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది ఒంటిమిట్ట ఆలయం. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఈ ఆలయానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ ప్రాచుర్యం కల్పిస్తోంది. శనివారం నాడు ఏపీ ప్రభుత్వం అధికారంగా శ్రీరామ నవమి వేడుకలను అధికారంగా ఈ ఆలయంలోనే నిర్వహిస్తుంది.
ఈ ఆలయానికి చెందిన కొన్ని ప్రత్యేకతలను పాఠకులకు అందిస్తున్నాం. నిజానికి ఒంటిమిట్ట ఆలయానికి చాలా చరిత్ర ఉంది. 11వ శతాబ్దానికి చెందిన అతి పురాతన, చారిత్రాత్మక ఆలయం ఇది.
అంతే కాదు ఆంజనేయుడు లేని రామాలయం కూడా ఇదే. ఈ ఆలయంలోని ఏకశిలపై సీతారాముల విగ్రహాలను ప్రతిష్టించారు. దీంతోపాటు రామలక్ష్ముల బాణాలతో ఏర్పడిన రామలక్ష్మణ తీర్దాలు ఇక్కడ ప్రత్యేకం.
అయోధ్య తర్వాత వెన్నెల రాత్రిలో కళ్యాణం జరిగే ఏకైక ఆలయం ఒంటి మిట్ట ఆలయమే. చంద్ర వంశానికి చెందిన సీతకు, సూర్య వంశానికి చెందిన శ్రీరాముడుకి శివధనస్సు విరిసిన సందర్భంలో సీతా స్వయంవరం జరిగింది.
ఈ ఆలయానికి ఇంకో ప్రత్యేకత ఉంది. ప్రతి శుక్రవారం రోజున హిందువులతో పాటు ముస్లింలు కూడా దర్శించుకుంటారు. ఈ ఆలయంలో రాముల వారి కళ్యాణాన్ని పండు వెన్నెల రాత్రిలో నిర్వహిస్తారు.
శ్రీరాముని కళ్యాణం ఇంటింటి వేడుక కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పండుగను ఘనంగా నిర్వహించాలనే తలంపుతో రూ. 10 కోట్లు నిధులను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరుపున డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి ఒంటిమిట్ట కోదండరామునికి పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు.
ఒంటిమిట్ట ఆలయ బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. పూజలు, వేడుకలు, కీర్తనలు, సంప్రదాయ నృత్యాలు, కోలాటాలు, తదితర కనువిందు చేసే కార్యక్రమాలతో పాటు ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజూ ప్రత్యేక అలంకారాలు భక్తులకు కనువిందు చేయనున్నాయి.
బ్రహ్మోత్సవాల దృష్ట్యా ఒంటిమిట్టలో తాగునీరు, పారిశుద్ధ్యం సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. ఇవాళ ఉదయం 4 గంటల నుంచే భక్తులు స్వామిని దర్శించుకునే వీలు కల్పించారు.
ఉదయం 9 గంటలకు నుంచి 11 గంటల వరకు, రాత్రి 6 నుంచి 10 గంటల వరకు వాహనసేవ, అదే సమయాల్లో కూచిపూడి, రామదాసు కీర్తనలు, జాంబవతి పరిణయం, బాలనాగమ్మ, కోలాటం, రామదండు, చెక్కభజన, కత్తిసాము, కేరళ కళాకారులచే వాయిద్య, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.