సీతానగరం రేప్ ఎఫెక్ట్ : ఏపీలో ఇకపై వారంతా మహిళా పోలీసులే-జగన్ సర్కార్ ఉత్తర్వులు
ఏపీలో తాజాగా చోటు చేసుకున్న సీతానగరం గ్యాంగ్ రేప్ ఘటన నేపథ్యంలో ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. మహిళల భద్రత కోసం ఇప్పటికే అమలు చేస్తున్న దిశ చట్టాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడంతో పాటు కొత్తగా కొన్ని మార్పులు చేపట్టింది. దీని ప్రకారం ఇకపై సచివాలయాల్లో పనిచేస్తున్న మహీళా సంరక్షణ కార్యదర్శి పోస్టును మహిళా పోలీసుగా పేరు మార్చారు.
ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా సంరక్షణ కార్యదర్శుల్ని ప్రభుత్వం గతంలో నియమించింది. అయితే వారికి పోలీసు యూనిఫామ్ కానీ శిక్షణ కానీ ఇవ్వకపోవడంతో వారు ఏం చేయాలో తెలియని పరిస్ధితుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు తాజాగా సీతానగరం గ్యాంగ్ రేప్ ఘటనతో అప్రమత్తమైన ప్రభుత్వం మరింత మంది మహిళా పోలీసుల సేవల్ని అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా గతంలో రిక్రూట్ చేసుకున్న మహిళా సంరక్షణ కార్యదర్శుల పోస్టుల్ని మహిళా పోలీసులుగా మార్చింది.

ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే మహిళా సంరక్షణ కార్యదర్శుల్ని మహిళా పోలీసులుగా పిలవాల్సి ఉంటుంది. వీరికి మహిళా పోలీసుల తరహాలోనే యూనిఫామ్తో పాటు బాధ్యతలు కూడా అప్పగిస్తారు. మహిళలపై జరిగే అకృత్యాలు, నేరాలు, వేధింపులకు సంబంధించి వీరు మహిళా పోలీసుల తరహాలోనే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ మేరకు సర్వీస్ రూల్స్లో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్ధానికంగా పోలీసు స్టేషన్లకు అనుబంధంగా వీరు ఇకపై పని చేయాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications