ఏపీ సర్కారు కీలక నిర్ణయం: ఏపీపీఎస్సీ నియామకాల్లో ఇంటర్వ్యూలు రద్దు, గ్రూప్-1కి కూడా
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ పోటీ పరీక్షల్లో ఇంటర్వ్యూలను పూర్తిగా ఎత్తివేసింది. గ్రూప్-1 సహా అన్ని కేటగిరీ పోస్టులకు ఇంటర్వ్యూలు రద్దు చేసినట్లు వెల్లడించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఉద్యోగాల ఎంపికలో ఇక నుంచి ఇంటర్వ్యూలు ఉండబోవని శశిభూషణ్ తెలిపారు. పోటీ పరీక్షల్లో సంపూర్ణ పారదర్శకత కోసమే నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పస్టం చేసింది. ఉత్తర్వులు వెలువడిన తేదీ నుంచి ఆదేశాలు వర్తిస్తాయని తెలిపింది.
ఈ నేపథ్యంలో ఇకపై వచ్చే జాబ్ నోటిఫికేషన్లకు కేవలం పరీక్షలు మాత్రమే నిర్వహించనున్నారు. ఇంటర్వ్యూలను ఎత్తివేయడంతో పరీక్షల్లో మెరిట్ ఆధారంగానే ఉద్యోగాల భర్తీ జరగనుంది.
గతంలో ఉద్యోగాల నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వాటికి అవకాశం లేకుండా చేసేందుకే ఇంటర్వ్యూలను రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే సీఎం వైఎస్ జగన్ జాబ్ కేలండర్ను విడుదల చేసిన విషయం తెలిసిందే.