బిల్డర్లు, ఇళ్లు కొనుక్కునే వారికి చంద్రబాబు అదిరిపోయే న్యూస్..!
ఏపీలో గత ఐదేళ్లుగా రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. ముఖ్యంగా రాజధాని ఎక్కడో తెలియక జనం ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో తెలియని పరిస్ధితి. దీంతో లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. దీన్ని అధిగమించి తిరిగి రియల్ ఎస్టేట్ రంగాన్ని గాడిన పెట్టేందుకు కూటమి సర్కార్ సిద్దమైంది. ఇందులో భాగంగా చంద్రబాబు సర్కార్ కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చేలా ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
ఏపీలో భవన నిర్మాణాలు,లేఅవుట్ల అనుమతుల నిబంధనలు సులభతరం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ భవన నిర్మాణ నిబంధనలు 2017, ఏపీ భూమి అభివృద్ధి నిబందనలు 2017లో సవరణలు చేస్తూ రెండు వేర్వేరు జీవోలు ఇచ్చింది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా భవన, లే అవుట్ల అనుమతుల్లో మార్పులు తీసుకొచ్చినట్లు మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.

రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పెరిగేలా కీలక సంస్కరణలతో ఉత్తర్వులు జారీ చేశామని మంత్రి నారాయణ తెలిపారు.సంక్రాంతి కానుకగా బిల్డర్లు,డెవలపర్లు,ప్రజలకు అనుకూలంగా ఉండేలా నిబంధనల్లో మార్పులు చేస్తూ జీవోలు జారీ చేశామన్నారు. లే అవుట్లలో రోడ్లకు గతంలో ఉన్న12 మీటర్లకు బదులు 9 మీటర్లకు కుదిస్తూ సవరణ చేశామన్నారు. అలాగే 500 చ.మీ.పైబడిన స్థలాల్లో చేసే నిర్మాణాల్లో సెల్లార్ నిర్మాణానికి అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.
టీడీఆర్ బాండ్ల జారీ కమిటీలో రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ లను తొలగించారు. రాష్ట్ర,జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న స్థలాలు డెవలప్ చేసేందుకు 12మీ .సర్వీస్ రోడ్డు ఏర్పాటు నిబంధన కూడా తొలగించారు. బహుళ అంతస్తుల భవనాల సెట్ బ్యాక్ నిబంధనల్లో మార్పులు చేశారు. వీటితో పాటు మరిన్ని నిబంధనలు సరళతరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ల ప్రతినిధులతో చర్చించి తుది నిబంధనలు జారీ చేశామన్నారు.
తాజా ఉత్తర్వులతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం వేగం పుంజుకుంటుందని ఆయన వెల్లడించారు..












Click it and Unblock the Notifications