పీఆర్సీపై మళ్లీ అభ్యంతరాలు-సీఎస్ కు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం డిమాండ్లు-జగన్ తగ్గేనా ?
ఏపీలో ఉద్యోగుల పీఆర్సీ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రధాన ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు నిర్వహించి పీఆర్సీ ఫిట్ మెంట్ శాతాన్ని 23గా ఫైనల్ చేసింది. దీనికి ఉద్యోగ సంఘాలు కూడా అయిష్టంగానే సరేనన్నాయి. అయితే ఈ ప్రకటన వెలువడిన వారానికి ఇప్పుడు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సీఎస్ కు వినతిపత్రం ఇచ్చింది. ఇందులో పలు డిమాండ్లు కూడా పెట్టింది. అసలే పీఆర్సీ ఫిట్ మెంట్ శాతంపై ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది.
పీఆర్సీ ఫిట్ మెంట్
ఏపీలో పీఆర్సీ ఫిట్ మెంట్ వ్యవహారం రెండు నెలలుగా తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రభుత్వం గతంలో చెప్పినట్లుగా మంచి ఫిట్ మెంట్ శాతం ఇస్తుందని ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు భావించినా అలా జరగలేదు. గతంలో ప్రకటించిన 27 శాతం ఐఆర్ కంటే తక్కువగా చరిత్రలోనే తొలిసారి 23 శాతం ఫిట్ మెంట్ కు ఉద్యోగులు అంగీకరించాల్సి వచ్చింది. ఈ మేరకు సీఎం జగన్ తో జరిపిన చర్చల్లోనూ ఉద్యోగ సంఘాల నేతల్ని నోరెత్తనీయకుండా చేశారన్న వార్తలతో పీఆర్సీ ఫిట్ మెంట్ వ్యవహారం అసంతృప్తి రేపినా అంతిమంగా వారు సంతృప్తివ్యక్తం చేయడంతో కథ సుఖాంతం అయినట్లు అంతా భావించారు.
ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అభ్యంతరాలు
ప్రభుత్వం ప్రకటించిన, ఉద్యోగసంఘాలు ఇప్పటికే ఆమోదించిన 23 శాతం పీఆర్సీ ఫిట్ మెంట్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సీఎస్ సమీర్ శర్మకు తాజాగా వినతి పత్రం సమర్పించింది. దీంతో ఈ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ శాతం తమకు ఆమోదయోగ్యం కాదంటూ సంఘం నేత కేఆర్ సూర్యనారాయణ సీఎస్ కు ఇచ్చిన వినతిపత్రంలో తెలిపారు. అంతేకాదు కాన్ని డిమాండ్లు కూడా ప్రభుత్వం ముందు పెట్టారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులసంఘం నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
డిమాండ్లు ఇవే
ఏపీలో ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ శాతంపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం.. సర్కార్ ముందు కొన్ని డిమాండ్లు కూడా పెట్టింది. ఇందులో అశుతోశ్ మిశ్రా ఇచ్చిన పీఆర్సీ సిఫార్సుల్ని ఉద్యోగసంఘాలకు ఇవ్వాలని, గత ప్రభుత్వాలు ఇచ్చిన పీఆర్సీ శాతాల్ని దృష్టిలో ఉంచుకుని 30 శాతానికి తగ్గకుండా ఫిట్ మెంట్ ఇవ్వాలని కోరారు. 2018 జూలై 1 నుంచి నోషనల్ బెనిఫిట్ 2019 జూలై 1 నుంచి ఆర్ధిక ప్రయోజనాలు కల్పించాలని, ఈ నెల నుంచి నగదు ప్రయోజనాన్ని కల్పించి, 2019 జూలై 1 నుంచి గతేడాది చివరి వరకూ బకాయిల్ని జీపీఎఫ్ ఖాతాలకు జమ చేయాలని కోరారు.
హెచ్ఆర్ఏ, సీసీఏ, హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులకు భత్యాలను యథాతథంగా కొనసాగించాలని కూడా కోరారు. 70-75 వయసు ఉన్న పెన్షనర్లకు 10 శాతం, 75-80 ఏళ్ల మధ్య ఉన్న పెన్షనర్లకు 15 శాతం అదనపు పింఛన్ ఇవ్వాలని కోరారు. కేంద్ర పీఆర్సీతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని అనుసంధానించాలనే నిర్ణయాన్నికూడా వెనక్కి తీసుకోవాలని సంఘం కోరింది.
జగన్ తో భేటీకి రాలేకపోయాం
సీఎం జగన్ ఉద్యోగ సంఘాలతో నిర్వహించిన భేటీకి తాము అనివార్య కారణాల వల్ల రాలేకపోయామని, ముందు రోజు చర్చలు జరిపి మళ్లీ మూడు రోజుల్లో పిలుస్తామని చెప్పారని, కానీ అనూహ్యంగా తర్వాతి రోజే పిలిచి సీఎం జగన్ పీఆర్సీ శాతం ఫైనల్ చేసేసారని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆరోపించింది. ఆ రోజు తాము ఉద్యోగులతో చర్చలు జరిపేందుకు జిల్లాల పర్యటనకు వెళ్లామని, అందుకే సీఎంతో భేటీకి రాలేకపోయినట్లు వారు వెల్లడించారు. కాబట్టి ప్రభుత్వం మరోసారి ఈ వ్యవహారంపై సమీక్ష నిర్వహించి పీఆర్సీ ఫిట్ మెంట్ లో మార్పులు చేయాలని సంఘం కోరుతోంది.
జగన్ వెనక్కి తగ్గుతారా ?
ప్రభుత్వం గతంలో ప్రకటించిన 23 శాతం పీఆర్సీ ఫిట్ మెంట్ పై ఉద్యోగ సంఘాల్లో లోలోపల అసంతృప్తి ఉన్నా సీఎం జగన్ చెప్పారనే కారణంతో వెనక్కితగ్గారు. ఆ విషయాన్ని వారు బహిరంగంగా చెప్పారు. కానీ ఆ తర్వాత ఉద్యోగ సంఘాల నేతలపై ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకొందంటూ వార్తలొస్తున్నాయి. దీంతో అసంతృప్తిగా ఉన్న ఉద్యోగుల తరఫున ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఈ అసమ్మతి నోట్ అందజేసినట్లు తెలుస్తోంది.అయితే ప్రభుత్వం ఇప్పటికే ప్రధాన ఉద్యోగ సంఘాలతో భేటీ నిర్వహించి తుది నిర్ణయం తీసుకున్నందున ఇప్పుడు మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు దాదాపు లేనట్లే.