వార్డు వాలంటీర్లపై ఎస్ఈసి ఆంక్షలపై జగన్ సర్కార్ సవాల్ .. హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలోనే కాదు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల సమయంలోనూ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలను ఏపీ ప్రభుత్వం సవాల్ చేస్తుంది . తాజాగా మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో వార్డు వాలంటీర్లకు ఎలాంటి బాధ్యతలు అప్పగించవద్దని నిర్ణయం తీసుకుంది ఎస్ఈసి . ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నరాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు.

ఎస్ఈసి ఆదేశాలను సవాల్ చేస్తూ జగన్ సర్కార్ లంచ్ మోషన్ పిటీషన్
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని, ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హై కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై ఈరోజు హైకోర్టులో విచారణ జరుగనున్నది. మార్చి 10వ తేదీన రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణపై ఆటు అధికారులతోనూ, వివిధ రాజకీయ పార్టీల నేతలతో చర్చలు జరుపుతూ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసింది.

వాలంటీర్ లపై అడుగడుగునా ఎస్ఈసి ఆంక్షలు
ఎన్నికల్లో వాలంటీర్లను వినియోగించుకోరాదని, వారి కదలికపై దృష్టి సారించాలని, వారి మొబైల్ ఫోన్లను సైతం స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వాలంటీర్లు ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని, వారిచేత కనీసం ఓటర్ స్లిప్పులు కూడా పంపిణీ చేయించరాదు అని ఆదేశాలు జారీ చేసింది. విపక్షాల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు గా రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది.

ఎస్ఈసి ఆదేశాలపై అభ్యంతరం .. కోర్టు మెట్లెక్కిన ప్రభుత్వం
అయితే నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ రోజు జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఎస్ఈసి ఆదేశాలపై ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. వాలంటీర్ వ్యవస్థను అవమానించడమేనని మండిపడుతోంది. దీంతో ఈ వ్యవహారంపై కోర్టు మెట్లెక్కింది. ఈ రోజు మధ్యాహ్నం 2:15 గంటలకు కోర్టు పిటిషన్ ను విచారించనుంది.












Click it and Unblock the Notifications