ఏపీలో ఎవరు లోకల్? రాష్ట్రపతి ఉత్తర్వులపై తేల్చేందుకు కమిటీ ఏర్పాటు..!
ఆంధ్రప్రదేశ్ ను ఏపీ, తెలంగాణగా విభజిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుని పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఇక ఎవరి రాష్ట్రాల్లో వారు స్ధానికతను నిర్ణయించుకోవాల్సిన పరిస్దితి ఏర్పడనుంది. ఇందుకోసం 1974 నుంచీ అమల్లో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వులను సమీక్షించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది. ఇందుకోసం 8 మంది సభ్యులతో ఇవాళ కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో సీఎస్ తో పాటు ఇతర అధికారులు ఉన్నారు.
1974లో అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్తించేలా విద్యాసంస్ధల్లో ప్రవేశాలకు స్దానికత నిర్ణయానికి రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి నుంచి ఇవి అమల్లో ఉన్నాయి. అయితే మధ్యలో 2014లో ఏపీ-తెలంగాణ విభజన తర్వాత కూడా ఇవి కొనసాగాయి. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని అమల్లో ఉండటంతో కొనసాగిన ఈ ఉత్తర్వులను ఇప్పుడు ఆ కాలం పూర్తి కావడంతో సవరించాల్సిన పరిస్దితి. దీంతో ఏపీ ప్రభుత్వం ఇవాళ కమిటీ ఏర్పాటు చేసింది.

విద్యాసంస్ధల్లో ప్రవేశాలకు వర్తించే స్ధానికత నిర్ణయం కోసం రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ లేదా కొత్త ఉత్తర్వుల కోసం ఈ కమిటీ విధివిధానాలు రూపొందించనుంది. సీఎస్ ఛైర్మన్ గా వైద్యారోగ్య, వ్యవసాయ, సహకార, ఉన్నత విద్య, న్యాయ, జీఏడీ కార్యదర్శులు లేదా ముఖ్య కార్యదర్శులను ఈ కమిటీలో సభ్యులుగా ఉంచారు. వీరితో పాటు అడ్మిషన్లపై అనుభవం కలిగిన మరో సభ్యుడిని కూడా ఇందులో ప్రత్యేక ఆహ్వానితుడిగా తీసుకుంటారు. జీఏడీ కార్యదర్శి ఈ కమిటీ కన్వీనర్ గా ఉంటారు.రెండు నెలల్లో ఈ కమిటీ తమ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.












Click it and Unblock the Notifications