ఏపీ:ఉద్యోగుల బదిలీలకు...ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్;షరతులు వర్తిస్తాయి!
అమరావతి:ఎప్పటినుంచో ట్రాన్స్ ఫర్ కోసం ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఇది నిజంగా శుభవార్తే. కుటుంబ, ఆరోగ్య, వ్యక్తిగత కారణాల వల్ల తమకు అనుకూలమైన ప్రదేశానికి వెళ్లడం కోసం ఎదురుచూస్తూ నిషేధం కారణంగా నిరీక్షణలో ఉన్న గవర్నమెంట్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీపి కబురు అందింది.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల పరిమిత బదిలీలకు అనుమతిస్తూ ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు విడుదల చేసింది. గవర్నమెంట్ ఎంప్లాయిస్ ట్రాన్స్ ఫర్లపై మే 5 నుంచి జూన్ 4వరకు నిషేధం ఎత్తివేసింది. అయితే పరస్పర బదిలీలు, ఉద్యోగుల విజ్ఞప్తులతో కూడిన దరఖాస్తులకు మాత్రమే బదిలీలను అనుమతించారు. అయితే ఈ రెండు కారణాలతో బదిలీలను కోరుకునే ఉద్యోగులు సైతం ప్రస్తుతం వారు పనిచేస్తున్న ప్రాంతంలో మూడేళ్ల సర్వీసు ఖచ్చితంగా పూర్తి చేసుకొని ఉండాలి. అప్పుడు మాత్రమే వారైనా బదిలీకి అర్హులవుతారు.
తాజా బదిలీలకు...షరతులు
ఉపాధ్యాయులకు ఈసారి బదిలీలకు అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆరోగ్య సమస్యలు, వికలాంగులు, వితంతువులు వంటి కేసులకు సంబంధించి ఆయా ప్రదేశాల్లో వేకెన్సీ ఉంటేనే బదిలీలకు అనుమతిస్తారు. అయితే 40 శాతానికిపైగా లోపం ఉన్న దివ్యాంగులకు, కంటిచూపు సమస్య ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఇక భార్యాభర్తల విషయంలో కనీసం ఎనిమిదేళ్లు బదిలీకాలం వ్యత్యాసం ఉంటేనే బదిలీకి అవకాశ కల్పించారు. ఏసీబీ, విజిలెన్స్ కేసులో ఉన్న ఉద్యోగులకు ఈ బదిలీలు వర్తించవు. యథావిధిగా జూన్ 5 తర్వాత ఉద్యోగుల బదిలీలపై నిషేధం అమల్లోకి వచ్చేస్తుంది.
ప్రాధాన్యతలు...ఇలా
భర్తను కోల్పోయిన భార్యకు, కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగంలో చేరిన వారి దరఖాస్తులు కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. ఉద్యోగి తన కోసం లేదా తన కుటుంబ సభ్యుల కోసం కేన్సర్, ఓపెన్హార్ట్ సర్జరీలు, న్యూరో సర్జరీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వంటి వైద్యం కోసం పెట్టుకున్న ధరఖాస్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొంది. ఇక ఒకే ప్రదేశం కోరుకుంటూ ఎక్కువ దరఖాస్తులు వస్తే సీనియారిటీని, సామర్థ్య రికార్డును పరిగణనలోకి తీసుకోవాలి. ఇక పరస్పర బదిలీలకు సంబంధించి ఇరువురు ఉద్యోగులు ప్రస్తుతం వారు పనిచేస్తున్న కార్యాలయాల్లో 3 ఏళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలి. ఒకరు పూర్తి చేసి రెండో వారు చేయకుంటే పరిగణనలోకి తీసుకోరు.
తుది గడువు...రిపోర్టు
మే 5 నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుండగా, ధరఖాస్తులను అనుసరించి ఆయా ఖాళీలను మే 10వ తేదీనాటికి నోటిఫై చేయాలి. పరస్పర బదిలీల దరఖాస్తులు మే 15వ తేదీలోగా సంబంధిత కార్యాలయాలకు చేరాలి. మే 24లోగా వాటిని పరిశీలించి, మే 30లోగా ఆదేశాలు జారీ చేయాలి. బదిలీ పొందిన ఉద్యోగులంతా జూన్ 4లోగా రిపోర్టు చేయాలి. ఇదిలా ఉంటే ప్రభుత్వ, పంచాయితీరాజ్, మున్సిపల్ శాఖలతో పాటు అన్ని విద్యా సంస్థల్లోని టీచర్లకు కూడా వినతి బదిలీలకు అవకాశం కల్పించాలని యూటీఎఫ్ కోరింది. అన్ని శాఖల్లోని ఉపాధ్యాయులకు, భార్యా భర్తలకు అంతర్ జిల్లా, అంతర్ రాష్ట్ర బదిలీలకు కూడా అవకాశం ఇవ్వాలని ప్రభుత్వానికి విన్నవించుకుంది.
ట్రాన్స్కో...మెరిట్ ఆధారం...పదోన్నతులు
మరోవైపు సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి తమ విద్యుత్ శాఖ పరిధిలో మెరిట్ ఆధారంగానే పదోన్నతులు కల్పించాలంటూ ఏపీ ట్రాన్స్కో జేఎండీ దినేశ్ పరుచూరి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల పట్ల విద్యుత్ ఓసీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. అయితే దీనివల్ల తమకు అన్యాయం జరుగుతుందని రిజర్వుడు కేటగిరి ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.