ఏపీ ఉద్యోగులకు దీపావళి కానుక విడుదల..! జీవో జారీ..! వర్తింపు ఇలా..!
ఏపీలో ఉద్యోగ సంఘాల ఆర్ధిక ప్రయోజనాల విషయంలో తాజాగా సీఎం, మంత్రులు చర్చలు జరిపిన నేపథ్యంలో ఇచ్చిన కీలక హామీ అమలైంది. ఈ మేరకు ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది నుంచి పెండింగ్ లో ఉన్న ఈ బకాయిని విడుదల చేస్తూ ప్రభుత్వం ఇవాళ జీవో జారీ చేసింది. దీంతో ఉద్యోగులు దీపావళి కానుకగా దీన్ని భావిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో ఉద్యోగులు పెండింగ్ లో ఉన్న నాలుగు డీఏలపై ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తున్నారు. దసరాకు ఇందులో ఒక డీఏ అయినా విడుదల చేస్తారని భావించినా అలా జరగలేదు. దీంతో దీపావళి కానుకగా అయినా ఇవ్వాలని సర్కార్ పై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తొలుత ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చలు జరిపించింది. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలతో నేరుగా సీఎం చంద్రబాబే మాట్లాడారు. అనంతరం ఒక డీఏ బకాయి విడుదలకు అంగీకారం తెలిపారు.

అయితే ఈ డీఏ బకాయి ఎప్పటి నుంచి ఇస్తారన్న దానిపై క్లారిటీ ఇవ్వలేదు. నవంబర్ 1న ఇస్తామని మాత్రమే వెల్లడించారు. కానీ ఇవాళ అనూహ్యంగా దీపావళి కానుకగా ఒక డీఏ బకాయిల్ని గతేడాది జనవరి నుంచి వర్తింపచేస్తూ విడుదల చేసేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులకు కరవు భత్యాన్ని 01.01.2024 నుండి మూల వేతనంలో 33.67% నుండి 37.31% కి సవరించి, 3.64% పెంపుదలతో ఇస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు.

అలాగే ఈ డీఏ బకాయిల విడుదలను రాష్ట్రంలో జడ్పీ, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థలు, ఎయిడెడ్ పాలిటెక్నిక్ లతో సహా ఎయిడెడ్ సంస్థల ఉద్యోగులు, యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ లకు కూడా వర్తింపచేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే యూజీసీ పే స్కేళ్లు తీసుకుంటున్న ఉద్యోగులకు 230 శాతం నుంచి 239 శాతానికి డీఏను సవరిస్తున్నట్లు తెలిపింది.












Click it and Unblock the Notifications