పీఆర్సీపై ఉద్యోగులతో జాయింట్ స్దాఫ్ కౌన్సిల్ భేటీ-మూడు గ్రూపులుగా-ఒక్కొకరికి గంట
ఏపీలో ఉద్యోగుల పీఆర్సీ వ్యవహారంపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. సీఎస్ కమిటీ చేసిన సిఫార్సుల ప్రకారం 14.29 శాతం ఫిట్ మెంట్ తీసుకునేందుకు ఉద్యోగులు సిద్ధంగా లేకపోవడంతో ప్రభుత్వం పునరాలోచిస్తోంది. దీంతో ఇవాళ మరోసారి ఉద్యోగుల అభిప్రాయాలు తీసుకునేందుకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ నిర్వహిస్తోంది.
అమరావతి సచివాలయంలోని రెండో బ్లాక్ లో ప్రభుత్వం ఉద్యోగసంఘాలతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ నిర్వహిస్తోంది. ఇందులో ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీతో పాటు పలు ఉద్యోగ సంఘాలు పాల్గొంటున్నాయి. ఆర్ధిక మరియు సర్వీసెస్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆర్ధికశాఖ ఇఓ కార్యదర్శి కెవివి సత్యనారాయణ అధ్యక్షతన ప్రారంభం అయిన జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతల్ని మూడు గ్రూపులుగా విభజించి దీన్ని నిర్వహిస్తున్నారు.
అన్ని ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఒకే సారి సమావేశం కాకుండా మూడు గ్రూపులుగా విభజించి ఒక్కొక్క గ్రూపుతో గంట పాటు అధికారులు.చర్చిస్తున్నారు. ఉద్యోగుల పిఆర్సి అమలుకై ఫిట్మెంట్ నిర్ణయం, దాని అమలు తేదీ, మానిటరీ బెనిఫిట్ అమలు తేదీ తదితర అంశాలతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమగ్రంగా చర్చిస్తున్నారు. తొలి గ్రూపు చర్చలో భాగంగా ప్రభుత్వ సలహాదారు(ఉద్యోగుల సేవలు)పి.చంద్రశేఖర్ రెడ్డి, ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తో పాటు తొమ్మిది సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఉద్యోగులు కోరుతున్న విధంగా కనీసం 45 శాతం ఫిట్ మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. అలాగని ప్రభుత్వం ఇవ్వజూపుతున్న 30శాతం ఫిట్ మెంట్ కు ఉద్యోగులు ససేమిరా అంటున్నారు. దీంతో ఉద్యోగులకు ప్రభుత్వ ఆర్ధిక పరిస్ధితిని వివరించేందుకు ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత ఉద్యోగులు ఓ అంగీకారానికి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఈ మేరకు పీఆర్సీపై తుది ప్రకటన చేయనుంది.