Local body elections:అభ్యర్థులకు విద్యార్హతలను తప్పనిసరి చేసే దిశగా జగన్ సర్కార్: త్వరలో కేబినెట్లో
అమరావతి: రాష్ట్రంలో మరోమారు ఎన్నికల వేడి రాజుకుంది. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల తరహాలోనే ఈ సారి స్థానిక సంస్థల పోలింగ్ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ఎక్కించింది. గ్రామాల దగ్గరి నుంచి నగరాల వరకూ ఈ వేడి అలముకోనుంది. జిల్లా పరిషత్, మండల పరిషత్, సర్పంచ్ ఎన్నికలకు న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఆ వెంటనే షెడ్యూల్ వెలువడటం చకచకా సాగిపోయాయి.

ప్రతిపాదనల రూపకల్పనలో..
ఈ సారి స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరికొత్త వ్యూహాన్ని అనుసరించాలని భావిస్తోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు విద్యార్హతలను నిర్ధారించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కనీస విద్యార్హత ఉన్న అభ్యర్థులను మాత్రమే ఎన్నికల బరిలో దింపాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని అంటున్నారు. ఏ స్థాయిలో, ఎలాంటి విద్యార్హతలను తప్పనిసరి చేయాలనే అంశం మీద అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

త్వరలో మంత్రివర్గం సమక్షానికి..
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయదలిచిన అభ్యర్థులకు కనీస విద్యార్హతలను కల్పించడానికి ఉద్దేశించిన ప్రతిపాదనలకు అధికారులు తుదిరూపాన్ని ఇస్తున్నారు. త్వరలో నిర్వహించబోయే మంత్రివర్గ సమావేశం సమక్షానికి ఈ ప్రతిపాదనలను తీసుకుని అవకాశాలు ఉన్నాయి. దీనిపై మంత్రివర్గంలో సమగ్రంగా చర్చించిన తరువాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తుది నిర్ణయాన్ని తీసుకుంటారు. మంత్రుల నుంచి అభిప్రాయాలను సేకరించి, దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవచ్చు.

విద్యార్హతులు ఇలా..
ఎంపీటీసీ, జడ్పీటీసీ, మండల ప్రజా పరిషత్, సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేయదలిచిన అభ్యర్థులకు కనీస విద్యార్హతలు ఎలా ఉండాలనే అంశంపై ప్రస్తుతం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలకు పోటీ చేయదలిచిన అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్, జడ్పీటీసీ, మండల ప్రజా పరిషత్ అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలనే నిబంధనలపై అధికారులు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే- వార్డు మెంబర్లకు పోటీ చేయాలనుకున్న వారి కనీస విద్యార్హత 10వ తరగతిగా నిర్ధారించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

షెడ్యూల్ ఇలా..
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 17వ తేదీన నోటిపికేషన్ విడుదల కానుంది. వచ్చే నెల 8న ఎన్నికలను నిర్వహిస్తారు. అదే నెల 10వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు. 15వ తేదీన ఎంపీపీ, జడ్పీ చైర్మన్ల ఎంపిక ఉంటుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వచ్చేనెల 8వ తేదీన నోటిఫికేషన్ విడుదల అవుతుంది. మూడుదశల్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తారు. మార్చి 3వ తేదీ నాటికి ఇది ముగుస్తుంది.












Click it and Unblock the Notifications