ఏపీ వాసులకు గుడ్ న్యూస్....కరోనా అత్యవసర మందు రెడీ- దేశంలోనే తొలిసారి భారీగా..
ఏపీలో కరోనా ప్రభావం మొదలయ్యాక సీఎం జగన్ తీసుకుంటున్న పలు నిర్ణయాలను, వివిధ సందర్భాల్లో చేస్తున్న వ్యాఖ్యలను విపక్షాలు ఎప్పటికప్పుడు రాద్దాంతం చేస్తున్నా జనం కోణంలో అవి వాస్తవమేనని నిరూపణ అవుతూనే ఉన్నాయి. గతంలో కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని జగన్ చెప్పినప్పుడు నవ్విన వారే తర్వాత అదే వ్యాఖ్యలను పలు సందర్భాల్లో సమర్ధించారు. ఇప్పుడు అలాంటిదే మరో అంశంలో జగన్ తీసుకున్న నిర్ణయం ఎంతో మంది రోగులకు అత్యవసర పరిస్దితుల్లో ప్రాణాలు కాపాడనుంది. ఇప్పటివరకూ మలేరియా మాత్రలతోనే కాలక్షేపం చేస్తున్న వైద్యులకు కూడా అత్యవసర సమయాల్లో ఉపయోపడబోతోంది.
Recommended Video
సీఎంలతో మోడీ సమావేశం: 27వ తేదీన కరోనా పరిస్థితులపై చర్చ, కేసులు పెరుగుతున్న క్రమంలో..
జగన్ దూరదృష్టి...
ఏపీలో కరోనా ప్రభావం గుర్తించడంలో తొలుత కాస్త తడబడినా ఆ తర్వాత మాత్రం సీఎం జగన్ వేగంగా స్పందించారు. అధికారులను పిలిపించుకుని వాస్తవ పరిస్దితిని అంచనా వేశారు. అందుకు తగ్గట్టే కరోనా ఇప్పట్లో వదిలిపోదని, ప్రాణాంతక వైరస్ తో సహజీవనం చేయక తప్పదని అందరి కంటే ముందే తేల్చేశారు. అప్పట్లో విపక్షాలతో పాటు సాధారణ జనం కూడా నవ్వుకున్నారు. ముఖ్యమంత్రిగా జనాన్ని కాపాడాల్సింది పోయి సహజీవనం చేయమనడం ఏంటని ప్రశ్నించారు. విపక్షాలైతే కరోనాతో సహజీవనం మీరు చేసుకుండి మాకు మాత్రం మందులిప్పించడన్నాయి. కానీ ఆ తర్వాత దేశ ప్రధాని మోడీతో పాటు ఆర్ధిక వేత్తలు కూడా ఇది తప్పనిసరి అని తేల్చేశారు. ఇదే కోణంలో జగన్ తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు.
ఏపీ ఆస్పత్రుల్లో రెమ్డెసివిర్....
కరోనా అత్యవసర చికిత్సలో భాగంగా వాడుతున్న రెమ్డెసివిర్ మాత్రలను వాడాలా వద్దా అని రాష్ట్రాలు తటపటాయిస్తున్న వేళ.. జగన్ మాత్రం ఇందుకు సై అనేశారు. హెటిరో ఉత్పత్తి చేస్తున్న రెమిడెసివిర్ మాత్రలను భారీ స్ధాయిలో అందుబాటులోకి తీసుకురావాలని జగన్ తాజాగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో హెటిరో నుంచి తొలి దశలో దాదాపు 15 వేల డోసులకు పైగా ఆర్డర్ ఇచ్చారు. వీటిలో ఇప్పటికే ఐదు వేల డోసులు రాష్ట్రానికి రాగా.. మరో పది వేల డోసులు ఇవాళ రాష్ట్రానికి రానున్నాయి. వీటిని ఇవాళ సాయంత్రం నుంచి కరోనా ప్రత్యేక ఆస్పత్రుల్లో అత్యవసర మందులుగా అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో అత్యవసర పరిస్ధితుల్లో ప్రాణాలు కోల్పోతున్న రోగులకు తక్షణ ఉపశమనం లభించనుంది.
త్వరలో భారీగా అందుబాటులోకి...
ఏపీలో ప్రస్తుతం పనిచేస్తున్న కోవిడ్ 19 ఆస్పత్రులకు తొలిదశలో 15 వేల రెమ్డెసివిర్ డోసులను పంపిస్తున్నారు. వీటిని ఒక్కో రోగికి రెండు, మూడు సార్లు అందించాల్సి ఉంటుంది. ఈ లెక్కన భారీగా డోసులు అవసరం అవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.. అందుకే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా భారీగా రెమ్డెసివిర్ డోసులను అందుబాటులోకి తెస్తోంది. ప్రభుత్వ వినతి మేరకు హెటిరో డ్రగ్స్... ఆగస్టు మూడో వారం నాటికి మరో 70 వేల డోసులను ఏపీకి పంపబోతోంది. 15 వేల మంది ప్రాణాలు కాపాడేందుకు దాదాపు 90 వేల డోసులు ఉంటే సరిపోతుందని నిపుణులు ప్రాధమికంగా అంచనా వేశారు. దీన్ని బట్టి చూస్తే దేశంలోనే తొలిసారిగా ఇంత భారీ స్ధాయిలో కరోనా అత్యవసర మందులు ఓ రాష్ట్రానికి అందుబాటులోకి వచ్చినట్లవుతుందని అధికారులు చెబుతున్నారు.
రోగులకే కాదు వైద్యులకూ ఊరట...
ప్రస్తుతం కరోనా సోకిన వారికి డాక్టర్లు హోమో క్వోరోక్విన్, హైడ్రాక్సీ క్వోరోక్విన్ వంటి మలేరియా మాత్రలతోనే నయం చేయాల్సిన పరిస్ధితి. అయితే కొన్ని సందర్భాల్లో ఈ మాత్రలు కూడా రోగులపై పనిచేయడం లేదు. వైరస్ సోకిన తీవ్రతను బట్టి వీరికి అత్యవసర మందులు అందించక తప్పని పరిస్ధితి. దీంతో ప్రభుత్వంతో పాటు డాక్టర్లపైనా ఒత్తిడి పెరుగుతోంది. అత్యవసర మందులు అందుబాటులో లేకపోవడంతో డాక్టర్లు కూడా రోగుల ప్రాణాలు పోతున్నా నిస్సహాయంగా చూడాల్సిన పరిస్ధితి. కానీ ఇప్పుడు ప్రభుత్వం రెమ్డెసివిర్ ను అందుబాటులోకి తెస్తుండటంతో రోగులతో పాటు డాక్టర్లకూ ఊరట దక్కనుంది. అయితే వీటిని ఏయే పరిస్దితుల్లో వాడాలో ప్రభుత్వం ఇప్పటికే డాక్టర్లకు దిశానిర్దేశం చేసింది.