ఏపీలో స్కూలు బస్సులు, ఆటోలకు కొత్త నిబంధనలివే- పాటించకుంటే సీజ్ తప్పదు...
ఏపీలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ స్కూళ్లను నవంబర్ 2 నుంచి నడుపుతున్నారు. అయితే కరోనా తగ్గిన నేపథ్యంలో స్కూళ్లను తెరిచినప్పటికీ పలు జిల్లాల్లో ఇంకా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా స్కూళ్లకు వస్తున్న విద్యార్ధులు, టీచర్లకు కూడా కరోనా పాటిజివ్ కేసులు రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వీరికి కరోనా సోకడానికి రవాణా సదుపాయాలూ కూడా ఓ కారణమని గుర్తించిన ప్రభుత్వం తాజాగా స్కూలు బస్సులు, ఆటోలకు మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఏపీలో ప్రభుత్వం విడుదల చేసిన నిబంధనల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లకు విద్యార్ధులను తీసుకెళ్లే ఆటోలు, బస్సులను పిల్లలు ఎక్కే ముందు, దించాక శానిటైజ్ చేయాల్సి ఉంటుంది. వాహనాల్లో అధిక సామర్ధ్యం కల ఎయిర్ ఫిల్టర్లను బిగించాలి. వాహనాల్లో సీటుకు ఒకరినే కూర్చోపెట్టాలి. అలాగే వాహనాల కిటికీలను తెరిచే ఉంచాలి. బస్సులు, ఆటోల్లో ఏసీలు వాడకూడదు. ధర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే పిల్లలను వాహనాలు ఎక్కించాలి. స్కూలు ఆటోలో అయితే ముగ్గురు పిల్లలను మాత్రమే కూర్చోబెట్టాలి. వాహనాన్ని నడిపే, అందులో ఉంటే ఇతర సిబ్బంది కూడా మాస్కులు, ఫేస్ షీల్డులు ధరించాల్సిందే.
వాహనం ప్రయాణం మొదలుపెట్టిన సమయం నుంచి తిరిగి స్కూలుకు చేరే సమయం వరకూ అందులో ఉండే సిబ్బంది కరోనా మార్గదర్శకాలు పాటించాల్సిందే. విద్యార్ధులను స్కూళ్లకు తీసుకెళ్లే ప్రైవేటు ఆటో డ్రైవర్లు సైతం నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. వీటిలో ఎక్కడైనా తేడా వచ్చి విద్యార్ధులకు కరోనా సోకినట్లు తేలితే అంటు వ్యాధుల నిరోదక చట్టం కింద వీరిపై చర్యలుంటాయని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో స్కూలు బస్సులు, ఆటోల సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.