మరో మున్సిపల్ పోరుకు జగన్ రెడీ- మిగిలిన 32 చోట్ల- కొత్త ఎస్ఈసీతో
ఏపీలో తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల సునామీ సృష్టించిన వైసీపీ ఇప్పుడు అదే ఊపులో మిగిలిన కొన్ని పట్టణ స్ధానిక సంస్ధల్లోనూ ఎన్నికలు పూర్తి చేసేందుకు సిద్ధమవుతోంది. కోర్టు కేసులు, విలీనాలపై అవరోధాలు, అభ్యంతరాలతో నిలిచిపోయిన ఈ ఎన్నికలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి పాలనపై దృష్టిపెట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు వచ్చే నెలలో ఆయా చోట్ల సామాజిక సర్వేతో పాటు డివిజన్ల పునర్విభజన, ఇతర కార్యక్రమాలు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లబోతోంది.
ఏపీలో మరో మున్సిపల్ పోరు
ఏపీలో తాజాగా 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, 12 కార్పోరేషన్లలో ఎన్నికలు జరిగాయి. వీటిలో ఏలూరు కార్పోరేషన్ ఓట్ల లెక్కింపుపై హైకోర్టు నిషేధం విధించడంతో అక్కడ ఫలితం పెండింగ్లో ఉంది. ఇవికాక ఎన్నికలు వాయిదా పడిన మరో 32 కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఇప్పటికే వరుసగా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల విజయాలతో ఊపుమీదున్న వైసీపీ సర్కారు.. అదే ఊపును వీటిలోనూ కొనసాగించాలని పట్టుదలగా ఉంది. అంతే కాదు మిగిలిన ఎన్నికలు కూడా ముగిసిపోతే ఇక పాలనపై దృష్టిపెట్టేందుకు వీలవుతుందని అంచనా వేస్తోంది.
ఈసారి ఎన్నికలు జరిగేది ఇక్కడే
ప్రస్తుతం రాష్ట్రంలో మూడు కార్పోరేషన్లు, 29 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో శ్రీకాకుళం, నెల్లూరు, రాజమండ్రి కార్పోరేషన్లలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అలాగే శ్రీకాకుళం జిల్లా రాజాం నగర పంచాయతీ, కృష్ణాజిల్లా వైఎస్సార్ తాడిగడప, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తణుకు, నెల్లూరు జిల్లా కావలి, ఆలూరు, గూడూరు, ప్రకాశం జిల్లా కందుకూరు, పొదిలి, గుంటూరు జిల్లా బాపట్ల, చిత్తూరు జిల్లా బి.కొత్తకోట, కడప జిల్లా రాజంపేటతో పాటు మరికొన్ని మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.
చురుగ్గా ఎన్నికల ముందస్తు ప్రక్రియ
రాష్ట్రంలో ఎన్నికలు జరగని పట్టణ స్ధానిక సంస్ధల్లో సామాజిక సర్వేతో పాటు రిజర్వేషన్ల ఖరారు, వార్డుల విభజన ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. పలుచోట్ల వార్డులు, డివిజన్ల పునర్విభజన జరుగుతోంది. వీటిలో అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఏప్రిల్ నెలాఖరు కల్లా ఈ కార్యక్రమం పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆ తర్వాత ఎన్నికల సంఘానికి నివేదిక పంపుతారు. దీని ఆధారంగా ఎస్ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారు. తాజాగా పలు పట్టణ స్ధానిక సంస్ధల్లో ఎన్నికల ప్రక్రియపై హైకోర్టులో దాఖలైన కేసులు కూడా క్రమంగా తొలగిపోతున్నాయి. దీంతో ఆయా చోట్ల ఎన్నికలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.
నీలం సాహ్నీ ఆధ్వర్యంలో తొలి ఎన్నికలు
రాష్ట్రంలో ప్రస్తుతం ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఎస్ఈసీగా నీలం సాహ్నీ బాధ్యతలు చేపడతారు. ఈ మేరకు గవర్నర్ నిన్ననే ఆమె పేరు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నీలం సాహ్నీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరిగే తొలి ఎన్నికలు ఇవే కానున్నాయి. ఏప్రిల్ నెలాఖరు కల్లా ప్రభుత్వం రిజర్వేషన్లతో పాటు ఇతర ఏర్పాట్లను పూర్తి చేసి జాబితాలు అందిస్తే మే నెలలో ఆయా చో్ట్ల ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ షెడ్యూల్ విడుదల చేయనుంది.