ఏపీలో పరిషత్ పోరు లేనట్లే ? జిల్లాల పునర్విభజనే తర్వాతే-ప్రభుత్వం వ్యూహాలు
ఏపీలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఈ ఆదివారం వెలువడాల్సి ఉంది. ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. అదే సమయంలో ఈ నెలాఖరున రిటైర్ అవుతున్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్.. ఈ నెల 15 నుంచి 21 వరకూ సెలవుపై వెళ్తున్నారు. దీంతో పరిషత్ పోరు జరగడం కష్టమని తేలిపోయింది. ప్రభుత్వం కూడా పెండింగ్లో ఉన్న జిల్లాల విభజన పూర్తి కాకముందే ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడం లేదని అర్ధమవుతోంది. దీంతో పరిషర్ పోరు అనివార్యంగా వాయిదా పడబోతోంది.
ఏపీలో పరిషత్ పోరు వాయిదా ?
ఏపీలో పెండింగ్లో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో జరగడం కష్టమేనా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను పట్టుబట్టి నిర్వహించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పుడు పరిషత్ పోరుకు వచ్చేసరికి చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. అందులో హైకోర్టులో పరిషత్ పోరుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లయితే, రెండవది ప్రభుత్వానికి ఆసక్తి లేకపోవడంగా కనిపిస్తోంది. హైకోర్టు కేసులపై ప్రభుత్వం, ఎస్ఈసీ సీరియస్గా దృష్టిపెడితే వివాదాలు సమసిపోవడం ఖాయం. కానీ ఇద్దరూ అందుకు ప్రయత్నించడం లేదు. దీంతో పరిషత్ పోరు వాయిదా ఖాయంగా కనిపిస్తోంది.
సెలవుపై వెళ్తున్న నిమ్మగడ్డ
ఏపీలో పంచాయతీ, మున్సిపల్ పోరు విషయంలో ఉరుకులు పరుగులు పెట్టడమే కాకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని సైతం పరుగులు పెట్టించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విషయంలో అదే ఊపు కొనసాగించడం లేదు. దీనికి తోడు ఆయన ఈ నెల 15 నుంచి 21 వరకూ సెలవుపై వెళ్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ వెళ్లేందుకు ఎల్టీసీ అనుమతి కోరుతూ ఆయన ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో ఆయన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ప్రకటించి సెలవుపై వెళ్లిపోవడం ఖాయమైంది. అయితే 22న ఆయన తిరిగి జాయిన్ అయ్యాక కూడా రిటైర్మెంట్కు కేవలం 9 రోజుల సమయమే ఉంటుంది. దీంతో పరిషత్ పోరు నిర్వహణ అసాధ్యమే అని తేలిపోతోంది.
జిల్లాల విభజన తర్వాతే పరిషత్ పోరు
ప్రభుత్వం ఏపీలో జిల్లాలను విభజించేందుకు ఇప్పటికే రెండు కమిటీలు ఏర్పాటు చేసింది. ఆయా కమిటీలు తమ నివేదికలకు తుది మెరుగులు దిద్దే క్రమంలో ఉన్నారు. దీంతో ఇప్పుడు పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తే ఆ తర్వాత జిల్లా విభజనతో కొత్త సమస్యలు తప్పవు. అందుకే జిల్లాల విభజన పూర్తయిన తర్వాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే అంశాన్ని ఎస్ఈసీ నిమ్మగడ్డకు కూడా చెప్పేసినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన సెలవుపై వెళ్లేందుకు సిద్దమయ్యారు. అదే సమయంలో ప్రభుత్వం వైపు నుంచి కూడా ఎలాంటి హడావిడి లేదు. ఈ ఏడాదిలో జిల్లాల విభజన పూర్తయ్యాకే పరిషత్ పోరు జరిగే అవకాశం ఉంది.
పరిషత్ పోరు వాయిదాతో అభ్యర్ధుల గగ్గోలు
గతేడాది ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు మొదలయ్యాక కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. అప్పట్లో రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో పరిషత్ పోరు ఏకగ్రీవమైపోయింది. అప్పట్లో ఏకగ్రీవమైన అభ్యర్ధులు తిరిగి ఎన్నికలు జరగవన్న ధీమాతో ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల సంఘంతో పాటు ప్రభుత్వం కూడా పరిషత్ పోరుపై ఆసక్తి చూపకపోవడంతో ఆ ఎన్నికలు తిరిగి జిల్లాల విభజన తర్వాతే జరుగుతాయి. అప్పుడు గతంలో జరిగిన ఏకగ్రీవాలకు కూడా విలువ ఉండదు. కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. అప్పుడు పరిస్ధితులు ఎలా ఉంటాయో కూడా తెలియదు. దీంతో గతంలో ఏకగ్రీవాలు చేసుకున్న అభ్యర్ధులతో పాటు పోటీలో ఉన్న మిగతా అభ్యర్ధులు కూడా ఇప్పుడు తాజా పరిణామాలతో గగ్గోలు పెడుతున్నారు.