ఏపీలో కొత్త జిల్లాలు.. ఆలోపు పూర్తి చేయాలని ప్లాన్.. స్థానిక సంస్థల ఎన్నికలు అందులోనే...
గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే కసరత్తులు ప్రారంభించిన ప్రభుత్వం.. వచ్చే ఏడాది రిపబ్లిక్ డే(జనవరి 26) నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది. అంతేకాదు,స్థానిక సంస్థల ఎన్నికలను కూడా కొత్త జిల్లాల్లోనే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఆ ఎన్నికలకు సంబంధించిన ప్రస్తుత నోటిఫికేషన్ రద్దయి కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లలో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది.
ఈసారి 'ఫటాఫట్' మంత్ర.. జగన్ కీలక నిర్ణయం.. మునుపెన్నడూ లేని రీతిలో...
ఎన్నికల హామీ.. కొత్త జిల్లాల ఏర్పాటు..
గత టీడీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త జిల్లాల ఏర్పాటుపై ఫోకస్ చేయలేదు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల సందర్భంగా ప్రతీ పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా మారుస్తామని హామీ ఇచ్చారు. ఇదే అంశాన్ని మేనిఫెస్టోలోనూ పెట్టారు. అధికారంలోకి వచ్చాక కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భావించారు. ఈ మేరకు ఈ ఏడాది జనవరి 12న కొత్త జిల్లాలను ప్రకటనకు ప్రభుత్వం సిద్దమవుతున్నట్టు కథనాలు వచ్చాయి.
వాయిదా పడ్డ కొత్త జిల్లాల ఏర్పాటు..
అయితే కొత్త జిల్లాల ఏర్పాటుకు వచ్చే ఏడాది వరకు వేచి చూడాలని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టుగా ప్రచారం జరిగింది. ఎన్పీఆర్ అప్డేట్ ప్రక్రియ పూర్తయ్యాక కొత్త జిల్లాల ఆలోచన చేయాలని అప్పట్లో కేంద్రం జగన్తో చెప్పినట్టు కథనాలు వచ్చాయి. ఏదైతేనేం మొత్తానికి కొత్త జిల్లాల ప్రకటన వాయిదా పడింది. అయితే ఆలోపు కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అనుగుణంగా మూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన తెర పైకి వచ్చింది. మచిలీపట్నం,గురజాల,అరకు కేంద్రాలుగా కొత్త జిల్లాల ఏర్పాటుకు సన్నాహాలు జరిగాయి. అయితే ఆ తర్వాత దీనిపై కూడా ఎటువంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదు.
Recommended Video
కొత్త జిల్లాల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు..?
ఇదే క్రమంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. కానీ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీనిపై ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లినా.. ఈసీదే తుది నిర్ణయమని న్యాయ స్థానం స్పష్టం చేసింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్తో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కానీ హైకోర్టు ఆ ఆర్డినెన్స్ను కొట్టివేసి తిరిగి నిమ్మగడ్డనే నియమించాలని స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వం దీనిపై ఇంతవరకూ నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు నిమ్మగడ్డ మాత్రం రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత ఎన్నికల ప్రక్రియను పునరుద్దరిస్తానని ప్రకటించారని. దీంతో మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో సస్పెన్స్గా మారింది. అయితే ప్రస్తుత ఎన్నికల నోటిఫికేషన్ రద్దయి కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అది కూడా కొత్త జిల్లాల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. అదే జరిగితే రిజర్వేషన్లకు సంబంధించి భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది.