ఆ భ్రమతోనే టిడిపి ఎన్డీఏకు గుడ్బై, రూ.15వేల కోట్ల ప్యాకేజీ తీసుకోవడం లేదు: హరిబాబు
న్యూఢిల్లీ: వైసీపీకి బిజెపి దగ్గరౌతోందనే భ్రమతోనే ఎన్డీఏ నుండి టిడిపి బయటకు వచ్చిందని విశాఖ ఎంపీ, ఏపీ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు హరిబాబు చెప్పారు. ఏపీ రాష్ట్రానికి కేంద్రం ఇప్పటికే 85 శాతం హమీలను అమలు చేసిందని ఆయన స్పష్టం చేశారు.
న్యూఢిల్లీలో మంగళవారంనాడు బిజెపి ఎంపీ హరిబాబు మీడియాతో మాట్లాడారు. ఏపీ రాష్ట్రం విషయంలో బిజెపిపై టిడిపి చేస్తున్న విమర్శలు అర్ధరహితమని ఆయన ప్రకటించారు.
ఏపీ రాష్ట్రానికి బిజెపి ఇచ్చిన అన్ని రకాల హమీలను అమలు చేసేందుకు సిద్దంగా ఉందన్నారు. మోడీ ప్రభుత్వంపై టిడిపి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని హరిబాబు విమర్శించారు.
ఆ భ్రమతోనే ఎన్డీఏ నుండి వచ్చిన టిడిపి
వైసీపీతో బిజెపి దగ్గరౌతోందనే భ్రమతోనే టిడిపి ఎన్డీఏ నుండి బయటకు వచ్చిందని బిజెపి ఎంపీ హరిబాబు ఆరోపించారు. వైసీపీతో తాము దగ్గర అవుతున్నామని భ్రమలో టిడిపి నేతలున్నారని ఆయన చెప్పారు. వైసీపీ పన్నిన ఉచ్చులో టిడిపి పడిందని హరిబాబు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ వ్యతిరేక పార్టీగా ఉన్న టిడిపిని తాము సహజమిత్రుడిగానే భావించినట్టుగా ఆయన చెప్పారు. కానీ, వైసీపిని బూచిగా చూపి ఎన్డీఏ నుండి టిడిపి బయటకు వచ్చిందన్నారు.
రైల్వేజోన్, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇస్తాం
ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన హమీల్లో భాగంగానే విశాఖకు రైల్వేజోన్తో పాటు కడపలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని బిజెపి ఎంపీ హరిబాబు చెప్పారు. ఏపీ రాష్ట్రానికి ఇప్పటికే సుమారు 85 శాతం హమీలను కేంద్రం అమలు చేసిందని చెప్పారు. ఇక మిగిలిన హమీలను కూడ అమలు చేస్తామని హరిబాబు ప్రకటించారు. ఏపీకి అసలు ఏమీ చేయలేదని టిడిపి నేతలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.
కేంద్ర ప్యాకేజీ తీసుకోలేదు
కేంద్ర ప్రభుత్వం ఇస్తామన్న రూ.15 వేల కోట్ల ప్యాకేజీని కూడ తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా లేదని విశాఖ ఎంపీ హరిబాబు చెప్పారు. ప్రత్యేక హోదా మినహ ఇతర సౌకర్యాలు కల్పిస్తామని చెప్పినా కానీ, రాష్ట్ర ప్రభుత్వం అందుకు సిద్దంగా లేదని ఆయన చెప్పారు.
ఏ ప్రభుత్వం చేయని సహయం
ఏ ప్రభుత్వం చేయని సహయాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిందని విశాఖ ఎంపీ హరిబాబు చెప్పారు. ఏపీకి ఇచ్చిన హమీల విషయంలో నాలుగైదు అంశాలు మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పారు. ఏపీకి నిధుల విషయంలో కేంద్రం అన్ని రకాలుగా సహయం చేసిందని ఆయన గుర్తు చేసింది. అయితే రాష్ట్రానికి సహయం చేస్తామని కేంద్రం ఇచ్చిన ఆఫర్లను రాష్ట్రం స్వీకరించకపోతే రాష్ట్రానికి నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు.