ఏపీలో మూడు ప్రవేశపరీక్షల షెడ్యూల్స్ విడుదల-ఈఏపీసెట్, ఈసెట్, ఐసెట్ తేదీలివే..
ఏపీలో ఈ ఏడాది నిర్వహించే మూడు కీలకమైన ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్స్ ఇవాళ విడుదలయ్యాయి.
ఏపీలో ప్రతీ ఏటా నిర్వహించే మూడు కీలకమైన ఉమ్మడి ప్రవేశపరీక్షల షెడ్యూల్స్ ను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్వహించే ఈ పరీక్షల్లో ఏపీఈఏపీసెట్, ఏపీ ఈసెట్, ఏపీ ఐసెట్ ఉన్నాయి. వివిధ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం కోసం ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోరుల్లో ప్రవేశాల కోసం ఈఏపీసెట్, పాలిటెక్నిక్ తర్వాత ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం ఈసెట్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఐసెట్ నిర్వహిస్తున్నారు.
ఇవాళ ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈఏపీసెట్ నోటిఫికేషన్ ఈ నెల10న విడుదల కానుంది. 11 నుంచి ఏప్రిల్ 15వరకూ ఆన్ లైన్ లో అప్లికేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 16 నుంచి 30 వరకూ రూ.500 లేటు ఫీజుతో అప్లికేషన్లు స్వీకరిస్తారు. అలాగే రూ.1000 లేటు ఫీజుతో మే1 నుంచి 5 వరకూ అప్లికేషన్లు స్వీకరిస్తారు. అలాగే రూ.5 వేల లేటు ఫీజుతో మే 6 నుంచి 12 వరకూ అప్లికేషన్లు స్వీకరిస్తారు. రూ.10 వేల లేటు ఫీజుతో మే 13, 14 తేదీల్లోనూ అప్లికేషన్లు తీసుకుంటారు. ఈ మధ్యలో మే 4 నుంచి 6వ తేదీ వరకూ అప్లికేషన్లలో తప్పుల సవరణకు అవకాశం కల్పిస్తారు. మే 7న హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంచుతారు. మే 15 నుంచి 18 వరకూ ఎంపీసీ విద్యార్ధులకు, మే 22, 23 తేదీల్లో బైపీసీ విద్యార్ధులకు ఏపీఈఏపీసెట్ పరీక్ష నిర్వహిస్తారు.

అలాగే ఈసెట్ విషయానికొస్తే.. మార్చి 8న నోటిఫికేషన్ విడుదలవుతుంది. మార్చి 10 నుంచి ఏప్రిల్ 10వరకూ అప్లికేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 11 నుంచి 15 వరకూ రూ.500 లేటు ఫీజుతో అప్లికేషన్లు తీసుకుంటారు. రూ.2 వేల రూపాయల లేటు ఫీజుతో ఏప్రిల్ 16 నుంచి 19 వరకూ అప్లికేషన్లు తీసుకుంటారు. 5 వేల రూపాయల లేటు ఫీజుతో ఏప్రిల్ 20 నుంచి 24 వరకూ కూడా అప్లికేషన్లు తీసుకుంటారు. ఏప్రిల్ 28న హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మే 5న ఏపీఈసెట్ పరీక్ష ఉంటుంది.
ఐసెట్ షెడ్యూల్ ను ఓసారి పరిశీలిస్తే.. మార్చి 17న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 వరకూ అప్లికేషన్లు స్వీకరిస్తారు. రూ.1000 లేటు ఫీజుతో ఏప్రిల్ 20 నుంచి 26 వరకూ అప్లికేషన్లు తీసుకుంటారు. 2 వేల లేటు ఫీజుతో ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకూ అప్లికేషన్లు స్వీకరిస్తారు. మే 4 నుంచి 10 వరకూ రూ.3 వేల లేటు ఫీజుతో అప్లికేషన్లు తీసుకుంటారు. 5 వేల లేటు ఫీజుతో మే 11 నుంచి 15 వరకూ అప్లికేషన్లు స్వీకరిస్తారు. మే 16, 17 తేదీల్లో అప్లికేషన్లలో తప్పుల సవరణకు అవకాశమిస్తారు. మే 20న హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకుని మే 24, 25 తేదీల్లో పరీక్షలు రాసేందుకు వీలు కల్పించారు.












Click it and Unblock the Notifications