ఏపీ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! బకాయిల విడుదల..!
ఏపీలో గతేడాది అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ పై ఉద్యోగుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా బకాయిల చెల్లింపు, పీఆర్సీ, ఐఆర్ పైనా అంచనాలు ఉన్నాయి. అయితే రాష్ట్రంలో మిగిలిన వర్గాల విషయంలో న్యాయం చేస్తున్న ప్రభుత్వం .. తమను మాత్రం ఏడాది పాలన పూర్తయినా ఇంకా పట్టించుకోవడం లేదనే అసంతృప్తి నెలకొంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఇవాళ బకాయిల్ని విడుదల చేసింది.
రాష్ట్రంలో సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం ఇవాళ తీపికబురు చెప్పింది. మొదటి విడత డీఏ బకాయిలు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. సీపీఎస్ ఉద్యోగుల డీఏ బకాయిలు ఏపీ సచివాలయ సీపీఎస్ ఉద్యోగులకు జమ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే మిగిలిన సిపిఎస్ ఉద్యోగులందరికీ 90 శాతం బకాయిలు నగదుగా చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం ఆరు విడుతలుగా ఈ బకాయిల చెల్లింపుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

డీఏ బకాయిల విడుదలపై ఏపీ సచివాలయ సీపీఎస్ ఉద్యోగుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఒక్కో ఉద్యోగికి 40వేలు నుంచి 70వేలు వరకు ప్రభుత్వం వారి ఖాతాలకు జమ చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన వారికి 6 విడతల్లో ఒక్కో ఉద్యోగికి 2నుంచి 4 లక్షల వరకూ బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ముందు ఈ బకాయిలు విడుదలైతే ఇతర అంశాలపై ఆ తర్వాత ఒత్తిడి పెంచాలని ఉద్యోగులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications