ఏపీలో కరోనా పరీక్షలపై కీలక నిర్ణయం - కేసులు పెరుగుతున్న వేళ : పాజిటివ్ గా వస్తే..!!
ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 1వ తేదీ నుంచి క్రమేణా కేసులు పెరుగుతున్నాయి. అయితే, మరణాల సంఖ్య తక్కువగా ఉండటంతో ప్రజలతో పాటుగా ప్రభుత్వం సైతం ఊపిరి పీల్చుకుంటోంది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ కేసుల గుర్తింపు కోసం విజయవాడ కేంద్రం ఏపీ ప్రభుత్వం జీనోమ్ సీక్వెన్సింగ్ లాబ్ ను ప్రారంభించారు. ఇక, ఇప్పుడు పరీక్షల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం ఆదేశించింది. కేసుల సంఖ్య పెరగటం వలన ఇబ్బంది లేదని.. కేసులను గుర్తిస్తేనే...కట్టడి సాధ్యం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఆర్టీపీసీఆర్ ధర రూ.350
దీంతో పాటుగా.. వ్యాక్సినేషన్ లోనూ ఏపీ ప్రభుత్వం ముందు వరుసలో ఉంది. ఇక, ఇదే సమయంలో రాష్ట్రంలో కోవిడ్ నిర్ధారణ పరీక్ష ఆర్టీపీసీఆర్ రేటును సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఐసీఎంఆర్ గుర్తింపు కలిగిన ఎన్ఏబీఎల్ ప్రైవేటు ల్యాబ్లలో ఆర్టీపీసీఆర్ ధరను రూ.350గా నిర్ణయించింది. ఆస్పత్రులు, ల్యాబ్లలో కచ్చితంగా సవరించిన రేట్లను ప్రదర్శించాలని ఆదేశించింది.
జిల్లా వైద్యాధికారులు సవరించిన రేట్లకే పరీక్షలు జరిగేలా నిరంతరం పర్యవేక్షించాలని సూచించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం పంపే శాంపిళ్ల టెస్టుకు రూ.475, అలాగే ఎన్ఏబీఎల్ ల్యాబ్లలో రూ.499 వసూలుచేస్తున్నారు.
ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు
రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల మేరకు ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా 38,055 నమూనాలను పరీక్షించగా 6,996 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,534 కేసులు వెలుగుచూశాయి. విశాఖపట్నంలో 1,263, గుంటూరులో 758, శ్రీకాకుళంలో 573, అనంతపురంలో 462, ప్రకాశంలో 424, విజయనగరంలో 412 కేసులు వచ్చాయి.
వైరస్ బారిన పడి విశాఖపట్నంలో ఇద్దరు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. ఒక్క రోజులో 1,066 మంది కోవిడ్ నుంచి కోలుకోవడం విశేషం. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,17,384 చేరింది.
ఇందులో 20,66,762 మంది సంపూర్ణంగా కోలుకున్నారు. 14,514 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం 36,108 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం 3,19,22,969 శాంపిళ్లను పరీక్షించింది. ఇప్పటికే రాత్రి పూట కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది.
అమల్లోకి రాత్రి కర్ఫ్యూ - ఆంక్షలు
సినిమా థియేటర్లలో 50 శాతం ఆక్యెపెన్సీతో నడపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక, కరోనా మార్గదర్శకాలకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాస్కు లేకుంటే కనిపిస్తే జరిమానా విధించాలని.. షాపింగ్ మాల్స్ తో సహా అందరూ సామాజిక దూరం పాటించేలా చూడాలని స్పష్టం చేసింది.
దుకాణాల్లో సామాజిక దూరం పాటించకపోతే దుకాణదారులకు రూ 25 వేల వరకు జిరిమానా విధించనున్నారు. అదే విధంగా మార్పు కనిపించక పోతే వారి లైసెన్సులపై నిర్ణయం తీసుంటామాని ప్రభుత్వం హెచ్చరిస్తోంది.
కరోనా పరీక్షల్లో పాజిటివ్ గా నిర్దారణ అయితే, ఇప్పటికే థర్డ్ వేవ్ సమయంలో ఐసీఎంఆర్ ..కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని ప్రభుత్వం ఆదేశించింది.