ఏపీ ప్రైవేటు ల్యాబ్లల్లో కరోనా టెస్టింగ్ ఫీజులు మరింత తగ్గాయ్: ఎంతంటే?
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ భయానకంగా విస్తరిస్తోన్న వేళ.. ప్రభుత్వం మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించడానికి ప్రైవేటు ల్యాబొరేటరీల యజమానులు వసూలు చేస్తోన్న ఛార్జీలను మరింత కుదించింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఉత్తర్వులను జారీ చేసింది. కరోనా వైరస్ పరీక్షలను మరింత ముమ్మరం చేయడానికి ఈ కుదింపు వెసలుబాటు కల్పిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
తెలంగాణలో బెంబేలెత్తిస్తోన్న కరోనా: వరుసగా రెండో రోజూ: కోలుకోవట్లేదు: లోయెస్ట్ డిశ్చార్జీలు
కరోనా పరీక్షలకే వేలకు వేల రూపాయలను చెల్లించుకోవాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఊరట కల్పిస్తుందని అంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించడానికి రెండు రకాలుగా ఫీజులను వసూలు చేస్తున్నారు ప్రైవేటు ల్యాబొరేటరీల యజమానులు. కరోనా పరీక్షల కోసం నేరుగా వెళ్లే వ్యక్తుల దగ్గరి నుంచి శాంపిల్ ఒక్కింటికి 2900 రూపాయలను వసూలు చేస్తున్నారు.
ఈ మొత్తాన్ని 1900 రూపాయలకు కుదించింది. అలాగే ప్రభుత్వం నుంచి వెళ్లే కరోనా శాంపిళ్లను టెస్ట్ చేయడానికి ఒక్కొక్క పరీక్షకు 2400 రూపాయలను వసూలు చేస్తున్నారు. దీన్ని 1600 రూపాయలకు తగ్గించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది. వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేశారు. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబొరేటరీ (ఎన్ఏబీఎల్), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) గుర్తింపు పొందిన ప్రైవేటు ల్యాబొరేటరీల్లో ఈ ధరలు వర్తిస్తాయని పేర్కంది.
ఆర్టీ-పీసీఆర్ ద్వారా ఆయా ల్యాబొరేటరీల్లో కరోనా వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. కాగా.. తాజాగా సవరించిన రేట్లకు సంబంధించిన వివరాలను ప్రతి ల్యాబొరేటరీ ముందు అందరికీ తెలియజేసేలా ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం ఇదివరకే ఆదేశాలను జారీ చేసింది. తాము నిర్దేశించిన ఫీజుల కంటే అధిక మొత్తాన్ని వసూలు చేసే ల్యాబొరేటరీలపై కఠిన చర్యలను తీసుకుంటామని హెచ్చరించింది.
Recommended Video
ఇప్పటికే నిర్దేశిత ఫీజుల కంటే ఎక్కువ మొత్తాన్ని తీసుకుంటోన్న అయిదు ప్రైవేటు ఆసుపత్రులపై ప్రభుత్వం చర్యలను తీసుకున్న విషయం తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా, అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలపై రమేష్ ఆస్పత్రికి చెందిన హోటల్ స్వర్ణ హైట్స్ అనుమతులను అధికారులు రద్దు చేశారు. ఎనికేపాడులోని లక్ష్మీ నర్సింగ్ హోమ్ నిర్వహిస్తున్న హోటల్ అక్షయ, ఇండో బ్రిటిష్ హాస్పిటల్కు చెందిన ఐరా హోటల్, ఆంధ్రా హాస్పిటల్స్ కు చెందిన హోటల్ మర్గ్ కృష్ణయ్య , హోటల్ సన్ సిటీ అనుమతులను అధికారులు రద్దు చేశారు.