కరోనా వల్ల అనాధలైన పిల్లల కోసం జగన్ సర్కార్ కీలక నిర్ణయం
కరోనా మహమ్మారి ఎంతో మంది చిన్నారులను అనాధలను చేసేస్తోంది. కుటుంబాలకు కుటుంబాలే కరోనా కారణంగా కల్లోల పరిస్థితులకు చేరుకుంటున్నాయి. కరోనా బారిన పడి తల్లిదండ్రులు మరణించిన చిన్నారులు అనాధలుగా మారి దీనంగా రోదిస్తున్నారు.ఇలాంటి పిల్లల కోసం కరోనా కట్టడి కోసం పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి పిల్లలకు ప్రత్యేక సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అంతేకాదు కోవేట్ బారినపడి తల్లిదండ్రులు మరణించి అనాధలైన పిల్లలకు కూడా సంరక్షణ కేంద్రాలలో వసతి కల్పించాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాల్లో ఈ సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి,వాటికి ప్రత్యేక అధికారులను నియమించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న సమయంలో కరోనా కట్టడి చర్యల్లో భాగంగా పగటిపూట కర్ఫ్యూను పటిష్ఠంగా అమలు చేస్తున్న ప్రభుత్వం,కరోనా పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలను తీసుకుంటుంది. అలానే మహమ్మారి కట్టడి కోసం రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగిస్తోంది.