ఆదాయం లేని వేళ 56 కోట్ల ఆదా.. ఏపీ విద్యుత్ శాఖ ఎలా సాధించిందంటే.. ?
కరోనా లాక్ డౌన్ కారణంగా ఏపీలో ప్రభుత్వానికి ఆదాయం లభించే మార్గాలు మూసుకుపోయాయి. కొత్తగా రాబడి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ ఏపీ ప్రభుత్వానికి విద్యుత్ శాఖ తీపి కబురు చెప్పింది. లాక్ డౌన్ సమయంలో తాము చేపట్టిన చర్యలతో ప్రభుత్వానికి భారీగా డబ్బులు ఆదా అయినట్లు తెలిపింది. దీంతో ఉద్యోగులకు పూర్తిస్ధాయి జీతభత్యాలు సైతం ఇవ్వలేని పరిస్దితుల్లో ఉన్న జగన్ సర్కారుకు భారీ ఊరట లభించినట్లయింది.
ఏపీలో కరోనా రాకముందే..
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా సంక్షోభం ఎదురైన నేపథ్యంలోనూ ప్రజాధనం ఆదా చేయడంపైనే విద్యుత్ శాఖ దృష్టిపెట్టింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ఆరంభ దశలోనే రాబోయే సంక్షోభాన్ని అధికారులు ముందుగానే పసిగట్టారు. ఇప్పటికే విద్యుత్ కొనుగోళ్లపై కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టాల్సి రావడంతో మార్చి నెలలో ఆదాయం లేకపోతే కష్టమనే విషయాన్ని గ్రహించారు. దీంతో కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించకముందే దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలతో విద్యుత్ కొనుగోళ్ల కోసం సంప్రదింపులు ప్రారంభించారు.
ఫలించిన ముందస్తు వ్యూహం...కోట్ల ఆదా...
కరోనా వైరస్ సంక్షోభ ప్రారంభ సమయంలోనే దేశవ్యాప్తంగా డిమాండ్ అమాంతం తగ్గి విద్యుత్ ధరలు తగ్గడం కూడా ప్రారంభమైంది. ఈ పరిస్ధితిని గ్రహించిన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు మార్చి నెలకు కావాల్సిన విద్యుత్ డిమాండ్ ను లెక్కించారు. 357.22 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోళ్లు అవసరమని తేల్చారు. దీంతో గరిష్టంగా 2.64 రూపాయలు మాత్రమే చెల్లించి ఈ విద్యుత్ కొనుగోళ్లు ప్రారంభించారు. గతంలో విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయించిన కొనుగోలు ధర కంటే 1.57 రూపాయలు తక్కువ. దీంతో ఒక్క మార్చి నెలలోనే విద్యుత్ శాఖ 56 కోట్ల రూపాయలు ఆదా చేయగలిగింది
విద్యుత్ శాఖ భారీ ఆపరేషన్...
ఇదంతా కేవలం దేశవ్యాప్తంగా ధరలు తగ్గడం వల్ల వచ్చిన ఆదా మాత్రమే కాదు. లాక్డౌన్ ప్రకటించిన వెంటనే ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి అప్రమత్తమయ్యారు.సమన్వయం, వాణిజ్య, సాంకేతిక విభాగాల పర్యవేక్షణ బాధ్యతను ట్రాన్స్కో జేఎండీ కేవీఎన్ చక్రధర్బాబుకు అప్పగించి, అనుభవజ్ఞులతో ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశారు. గ్రిడ్ నిర్వహణ, రాష్ట్రంలో డిమాండ్ను ఎప్పటికప్పుడు అంచనా వేయడంతో పాటు, మార్కెట్లో విద్యుత్ లభ్యత, ఎంత చౌకగా ఏ సమయంలో దాన్ని తేవచ్చనే నిరంత విశ్లేషణలు చేపట్టడం వల్ల మంచి ఫలితాలొచ్చాయి.మార్కెట్లో చౌక విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల థర్మల్ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు పెరిగాయి.ప్రస్తుతం 21 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి.
అభినందనల వెల్లువ..
లాక్ డౌన్ సంక్షోభాన్ని కూడా అవకాశంగా మలుచుకుని విద్యుత్ కొనుగోలు భారాన్ని తగ్గించేందుకు ఏపీ ట్రాన్స్కో చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రశంసించారు. కీలక సమయంలలో ప్రభుత్వ శాఖల ఆదాయం పడిపోయిన వేళ 56 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వానికి ఇప్పుడు భారీ ఆదాగా కనిపిస్తోందంటే పరిస్ధితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు, దీంతో ఇప్పుడు విద్యుత్ అధికారులను ప్రభుత్వం అభినందిస్తోంది.