ఏపీలో కరోనా కట్టడికి రోజుకి 10 కోట్లు - తాజా గణాంకాలు వెల్లడించిన జగన్ సర్కార్
ఏపీలో కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం భారీగా ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో కరోనా నియంత్రణ చర్యలతో పాటు రోగులకు మందులు, ఆహారం వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. తాజాగా వీటి వివరాలను వైద్య ఆరోగ్య శాఖ తమ వేదికల్లో వెల్లడించింది.
కోవిడ్ 19 నియంత్రణ కోసం వైద్య ఆరోగ్యశాఖ ఇప్పటివరకూ రూ.693 కోట్లు ఖర్చు పెట్టినట్లు తేలింది. ఇందులో జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా రూ.259 కోట్లు, రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధుల నుంచి రూ. 326 కోట్లు ఖర్చుపెట్టారు. ఇవి కాక రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా మరో రూ.180 కోట్లు ఖర్చుపెట్టినట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. కోవిడ్ నియంత్రణ కోసం దాతలు ఇచ్చిన విరాళాలు కూడా ఇందులోనే ఉన్నాయా లేదా అన్నది వెల్లడి కాలేదు.
Recommended Video
ఇక రోజు వారీ ఖర్చు విషయానికొస్తే వైరస్ నిర్ధారణ పరీక్షల కోసం రూ.4.3 కోట్లు ఖర్చుపెడుతున్నారు. రోగులకు మందులు, ఇతర అవసరాల కోసం రూ.4.57 కోట్లు ఖర్చుపెడుతున్నారు. అలాగే రోగులకు భోజనం కోసం రూ.1.31 కోట్లు వ్యయం చేస్తున్నారు. ఇవన్నీ కలుపుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి రోజుకు రూ.10 కోట్ల వరకూ కరోనా నియంత్రణకు ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది. కరోనా వ్యాప్తి ప్రారంభమైన మొదట్లో ఇంత మొత్తం ఖర్చుపెట్టాల్సిన అవసరం రాలేదు. కానీ ప్రస్తుతం ఇంత భారీ ఖర్చవుతుండటంతో రాష్ట్ర ఖజానాపై తీవ్రమైన భారం పడుతోంది.