రాజధాని: రియల్ ఎస్టేట్ లావాదేవీలకు చెక్
హైదరాబాద్: నూతన రాజధాని నిర్మాణం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. వీజీటీఎం పరిధిలోని గ్రామ పంచాయతీల అధికారాలను ప్రభుత్వానికి బదలాయిస్తూ ప్రభుత్వం బుధవారంనాడు జీవో జారీ చేసింది.
దీంతో విజయవాడ - గుంటూరు - తెనాలి -మంగళగిరి (విడిటిఎం) పరిధిలో రియల్ ఎస్టేట్ లావాదేవీలకు చెక్ పడింది. విజిటిఎం పరిధిలోని అన్ని పంచాయతీల్లో పరిపాలనాధికారాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుది. వీజిటిఎం పరిధిలోని భూముల క్రయవిక్రయాలకు అనుమతి ఇచ్చే అధికారం గ్రామ పంచాయతీలకు ఉండదు.
అలాగే జన్మభూమి నేపథ్యంలో అక్టోబర్ 20 వరకు ఉద్యోగుల బదిలీల ప్రక్రియను ఏపీ ప్రభుత్వం నిలిపివేసింది. అక్టోబర్ 21 నుంచి 30 వరకు బదిలీలు కొనసాగనున్నాయి. ఇదిలావుంటే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అధ్యక్షతన ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం మూడు తీర్మానాలను ఆమోదించింది.
ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వాలని, ఢిల్లీలో పివి నర్సింహారావుకు స్మారకం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ, ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు అభినందనలు తెలుపుతూ మంత్రివర్గం తీర్మానాలు చేసింది.
ఇదిలావుంటే, ఎర్రచందనం వేలం విషయంలో ప్రభుత్వానికి ఊరట లభించింది. ఎర్ర చందనం వేలానికి ప్రభుత్వానికి అనుమతిస్తూ హైకోర్టు బుధవారంనాడు ఆదేశాలు జారీ చేసింది.