Anna Canteens: అన్న క్యాంటీన్ల ప్రారంభానికి ముహుర్తం ఖరారు-ఆహార సరఫరాకు టెండర్లు..!
ఏపీలో పేదలకు నామమాత్రపు ధరకు మూడు పూటలా కడుపు నింపేందుకు అన్న క్యాంటీన్లు సిద్ధమవుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో మూతపడ్డ అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించేందుకు కూటమి సర్కార్ శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది.
ఇప్పటికే గతంలో అన్న క్యాంటీన్లు నడిచిన భవనాల రిపేర్లు పూర్తి చేయడంతో పాటు కొత్తగా నిర్మాణాలు చేపడుతోంది. ఇప్పుడు తాజాగా ఈ క్యాంటీన్లలో సరఫరా చేసే ఆహార టెండర్లను కూడా పిలుస్తోంది. ఆగస్టు 15 కల్లా రాష్ట్రవ్యాప్తంగా క్యాంటీన్లు తెరుచుకోనున్నాయి.

ఆగస్టు 15న తొలి విడతగా 183 క్యాంటీన్లను తెరిచే అవకాశముంది. అనంతరం మిగిలిన క్యాంటీన్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. గతంలో నడిచిన అన్న క్యాంటీన్లను తిరిగి తెరిచే బాధ్యతను పట్టణ స్దానిక సంస్థలకు అప్పగించారు. వీటి కోసం రూ.20 కోట్ల నిధుల్ని కూడా కేటాయించారు. దీంతో ఆయా సంస్థలు వీటి రిపేర్లు, ఇతర పనులకు టెండర్లు పిలుస్తున్నాయి. అలాగే క్యాంటీన్లలో సాంకేతిక పరికరాల ఏర్పాటు కోసం మరో 7 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.
మరోవైపు క్యాంటీన్లలో ఆహార సరఫరాకు కూడా ప్రభుత్వం టెండర్లు పిలుస్తోంది. తొలిదశలో ప్రారంభించే 183 క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేసే సంస్థల నంచి టెండర్లు ఆహ్వానించారు. ఈ నెల 22 లోగా వీరు టెండర్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. నెలాఖరులోకా వీటిని ఖరారు చేసి సరఫరా కాంట్రాక్టులు అప్పగిస్తారు. అలాగే క్యాంటీన్లను నిర్వహించేందుకు దాతల నుంచి ఆదాయపు పన్ను మినహాయింపుతో విరాళాలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. త్వరలో దీనిపై అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వబోతోంది.












Click it and Unblock the Notifications