AP Ration Cards: ఏపీలో రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ..!
ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీ కోసం ప్రభుత్వం చర్యలు ప్రారంభిస్తోంది. రేపటి నుంచి ఈ మేరకు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుందని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇవాళ ప్రకటించారు. ఈ మేరకు అధికారులు సచివాలయాల్లో దరఖాస్తులు తీసుకుంటారన్నారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేషన్ కార్డుల లబ్దిదారుల పరిశీలన కోసం ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహించింది. ఇందులో నకిలీ కార్డుల ఏరివేత చేపట్టింది. అలాగే కొత్త కార్డుల కోసం లబ్దిదారులపై అంచనాలు తయారు చేసింది. కొత్త రేషన్ కార్డుల కోసం ఈకేవైసీ ప్రక్రియ కూడా మొదలుపెట్టింది. దీని గడువును సైతం ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతోంది.

ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈకేవైసీ పూర్తి చేసుకున్న వారు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించబోతోంది. స్దానిక సచివాలయాల్లో అధికారులు ఈ మేరకు కొత్త కార్డుల కోసం దరఖాస్తులు తీసుకుంటారు. అనంతరం వాటి పరిశీలన ఉంటుంది. లబ్దిదారుల పరిశీలన పూర్తయిన తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభిస్తారు. ఆ లోపు ఈకేవైసీ పూర్తి చేసుకున్న వారందరికీ కొత్త కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల జారీకి దరఖాస్తులు తీసుకుంటున్న నేపథ్యంలో లబ్దిదారులకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక సూచనలు చేశారు. ఇప్పటికే ఉన్న కార్డుల్లో మార్పులు చేర్పులు కావాల్సిన వారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అలాగే అనర్హులు ఉంటే తమ కార్డుల్ని ప్రభుత్వానికి సరెండర్ చేయాలని కూడా మంత్రి సూచిస్తున్నారు.
2024 ఎన్నికల నేపథ్యంలో నూతన కార్డుల జారీని నిలిపివేయాల్సినదిగా భారత ఎన్నికల సంఘం గత ఏడాది మార్చిలో ఆదేశాలు జారీచేయడం జరిగిందన్నారు. తదుపరి ఇకెవైసి తప్పని సరిగా నమోదు చేయాలని సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు నూతన కార్డుల జారీకి అవకాశం లేకుండా పోయిందన్నారు. ఇకెవైసి ప్రక్రియ వల్ల నూతన రైస్ కార్డుల జారీ ఆలస్యం అయిందని, అయితే ఇప్పటి వరకు 94.4 శాతం మేర ఇకెవైసి ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో నూతన రైస్ కార్డుల జారీకి అవకాశం కల్పించడం జరిగిందన్నారు.
రాష్ట్రంలో మొత్తం 1,46,21,223 రైస్ కార్డులు ఉన్నాయని, ఈ కార్డుల ద్వారా దాదాపు 4,24,59,028 మంది తమ పేర్లను నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. ఐదు సంవత్సరాల్లోపు పిల్లలకు మరియు 80 సంవత్సరాలు పైబడిన వారికి ఇకెవైసి చేయాల్సిన అవసరం లేదనే వెసులుబాటు కల్పించడం తో దాదాపు 6,45,765 మందికి ఇకెవైసి చేయడం జరగలేదన్నారు. అదే విధంగా ఇప్పటికే 3,94,08,070 మంది తమ రైస్ కార్డులో మార్పులు చేర్పుల కోసం నమోదు చేసుకోవడం జరిగిందని మంత్రి తెలిపారు.
ఈ ఏడాది జూన్ మాసంలో క్యూఆర్ కోడ్ తో స్మార్టు రైస్ కార్డులను జారీ చేస్తామని, ఆ కార్డులపై కుటుంబ సభ్యుల వివరాలు అన్నీ ఉంటాయని, ఆ కార్డును స్కాన్ చేయగానే అన్ని వివరాలు కనిపిస్తాయని, డాటా బేస్ కి ఈ కార్డును లింక్ చేయడం వల్ల సిస్టమ్ లో ఆటో మేటిక్ గా డాటా కూడా అప్డేట్ అవ్వడం జరుగుతుందని మంత్రి తెలిపారు.












Click it and Unblock the Notifications