అయిదేళ్లు చంద్రబాబు ఎక్కడ గాడిదలు కాశారు: ప్రభుత్వ స్కూళ్ల తరహాలో ఆసుపత్రులు: సజ్జల
పదేళ్ల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ను వదిలేసి వచ్చిన తెలుగుదేశం పార్టీకి తమను విమర్శించే హక్కు లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. నోటుకు ఓటు కేసులో చిక్కుకున్న చంద్రబాబు ఉమ్మడి రాజధాని నుంచి మూటామూళ్లె సర్దుకుని వచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఏ రోజు కూడా హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా భావించలేదని ఆరోపించారు. అలాంటి పార్టీ నాయకులు.. ఏపీ అంబులెన్సులను తెలంగాణ పోలీసులు సరిహద్దుల్లో అడ్డుకోవడాన్ని తప్పు పట్టడం సరికాదని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు అయిదేళ్లు ఏం చేశారు
ఈ మధ్యాహ్నం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను గుర్తించే అవకాశాన్ని చంద్రబాబు లేకుండా చేశారని ఆరోపించారు. రాష్ట్ర విభజన తరువాత మెరుగైన వైద్య సదుపాయాలు, వసతులు గల ఆసుపత్రులు తెలంగాణకు వెళ్లాయని చెప్పారు. విభజన అనంతరం నవ్యాంధ్రలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు.. వైద్య సదుపాయాల కల్పనపై ఏ మాత్రం దృష్టి సారించలేదని అన్నారు. అయిదేళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపించిన చంద్రబాబు అమరావతి పేరుతో జపం చేశారే తప్ప.. ఏనాడూ కనీస మౌలిక వసతులపై దృష్టి పెట్టలేదని అన్నారు.

ఉమ్మడి రాజధానిని కోల్పోవడానికి ఎవరు కారణం..
అటు పదేళ్ల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ను వదులుకుని.. ఇటు అమరావతిని నిర్మించలేక.. రాష్ట్రానికి అవసరమైన కనీస వైద్య, విద్య సదుపాయాలను కల్పించలేక- ఏడాదికి రెండుసార్లు చొప్పున విదేశాల్లో తిరిగి రావడానికి చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. భ్రమరావతి పేరుతో చంద్రబాబు అయిదేళ్ల పాటు కాలయాపన చేశారని విమర్శించారు. తన అయిదేళ్ల ప్రభుత్వ హయాంలో చంద్రబాబు భ్రమరావతిపై పెట్టిన ధ్యాసలో అయిదో వంతు కూడా వైద్యరంగానికి మౌలిక సదుపాయాలను కల్పించడంపై పెట్టలేకపోయారని ధ్వజమెత్తారు.

నాడు నేడు తరహాలో
తమ ప్రభుత్వం ఏర్పాటైన ఈ రెండేళ్లలో ప్రభుత్వ ఆసుపత్రులకు మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే నాలుగేళ్లలో ప్రభుత్వ ఆసుపత్రులకు మౌలిక సదుపాయాలను కల్పిస్తారని అన్నారు. నాడు నేడు పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను ఏ రకంగా అభివృద్ధి చేశారో.. అదే తరహాలో ప్రభుత్వ ఆసుపత్రులకు కూడా సరికొత్త రూపాన్ని ఇస్తారని సజ్జల అన్నారు. తెలంగాణ పోలీసులు ఏపీ అంబులెన్సులను ఆపడం దురదృష్టకరమని, దీనిపై తాము అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడు నెలకొన్న పరిస్థితులకు సంజాయిషీ ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబుదేనని అన్నారు.

చంద్రబాబును తప్పు పట్టట్లేదంటూ..
చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పులను తాము వేలెత్తి చూపదలచుకోలేదని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. చంద్రబాబు చేసిన తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. నాడు నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలకు వైఎస్ జగన్.. ఎలాంటి సదుపాయాలను కల్పించారో ప్రజలు ప్రత్యక్షంగా చూశారని, ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులను కూడా అలాగే తీర్చిదిద్దుతారని అన్నారు. ఈ సమస్యలను పరిష్కరించడంపైనే తాము దృష్టి సారించామని తేల్చి చెప్పారు. రాజకీయ విమర్శలు చేసే వారు ఎప్పుడూ చేస్తూనే ఉంటారని ఆయన ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications