సజ్జల అనూహ్య కామెంట్స్: అమిత్ షాతో జగన్ భేటీ బ్రహ్మాండమా? -రఘురామ, 3రాజధానులు, సీబీఐ కేసులపైనా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై ప్రతిపక్ష టీడీపీ, దాని అనుకూల మీడియా చేస్తోన్న విమర్శలు, రచ్చపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటు కౌంటరిచ్చారు. ఆ క్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షా పేరును ప్రస్తావిస్తూ, జగన్ పై సీబీఐ కేసులు అంశంపైనా అనూహ్య కామెంట్లు చేశారు. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు, టీడీపీ చీఫ్ చంద్రబాబులపైనా విమర్శలు చేశారు.
Recommended Video

జగన్ టూర్ లక్ష్యమదే..
రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటన జరిగిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఢిల్లీలో ఐదుగురు కేంద్రమంత్రులను సీఎం జగన్ కలిశారని, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలను ప్రస్తావించారని చెప్పారు. రాజకీయాలతో ఈ సమావేశాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. జగన్ ఎప్పుడూ తన ఢిల్లీ పర్యటనలపై ఊదరగొట్టింది లేదని, గతంలో చంద్రబాబు ఆ విధంగా డప్పు కొట్టుకునేవారని విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

3రాజధానులకు కేంద్రం సాయం
రాష్ట్ర ప్రయోజనాలకే సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని, గత ప్రభుత్వంలో పోలవరం పనులు ముందుకు సాగలేదని, ఇప్పుడు కరోనా సమయంలో కూడా పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయని సజ్జల అన్నారు. ప్రస్తుతం పోలవరం పనులు ఒక యజ్ఞంలా సాగుతున్నాయని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగడం ఖాయమని, సీఎం జగన్ విజన్తో తీసుకున్న నిర్ణయం అమలవుతుందన్నారు. అంతేకాదు, అభివృద్ధి వికేంద్రీకరణపై కేంద్రంలోని మోదీ సర్కారు సాయం కూడా ఉంటుందని సజ్జల స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు పేరిటే జగన్ సర్కారు మూడు రాజధానులను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇక,

అమిత్ షాతో భేటీ, సీబీఐ కేసులు
''గతంలో ఢిల్లీ పర్యటనల్లో చంద్రబాబు చీకటి ఒప్పందాలు చేసుకునేవారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే నాడు చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు జరిగాయి. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై ఎల్లో మీడియా హడావుడి చేసింది. హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ వాయిదా పడటంపై వింతకథనాలు ప్రసారం చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర హోం మంత్రితో భేటీ కావడం ఏమైనా బ్రహ్మాండమైన విషయమా? జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా కేసులు మాఫీ చేయించుకునేందుకేనని టీడీపీ గ్యాంగ్ ప్రచారం చేస్తుంది. అదే నిజమైతే ఇప్పటివరకు ఆయనపై ఎందుకు కేసులు కొట్టివేయలేదు?'' అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆనాడు కాంగ్రెస్, బీజేపీ కలిసి ఏపీ గొంతుకోశాయి. గత పాలనతో చంద్రబాబు రాష్ట్రాన్ని మరింత దిగజార్చాడని ఆయన మండిపడ్డారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని, అందుకే తమ పార్టీ ఎంపీలు చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరినట్లు సజ్జల వివరించారు.












Click it and Unblock the Notifications