వేడి నీళ్లలో ముంచి తీసిన బ్రాయిలర్ కోళ్లులా చంద్రబాబు..నారా లోకేష్: పీకడానికేమీ లేదు: సజ్జల
అమరావతి: తెలుగుదేశం పార్టీ దివాళా తీసిందని, ఐపీ పెట్టిందని ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. చంద్రబాబుపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత నెలకొందని, ఆయన నాయకత్వాన్ని క్యాడర్ ఏ మాత్రం నమ్మట్లేదని చెప్పారు. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ప్రచారం సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, వ్యవహార శైలిని చూసి టీడీపీ నాయకులు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. 2019 ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించలేదనే కారణంతో.. చంద్రబాబు జనాన్ని తిట్టే పని పెట్టుకున్నారనే విషయం స్పష్టమైందని సజ్జల అన్నారు.

ఎందుకా ఉక్రోశం..
చంద్రబాబును నమ్ముకుంటే.. కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టేననే అభిప్రాయం క్షేత్రస్థాయిలో టీడీపీ శ్రేణుల్లో నెలకొని ఉందని అన్నారు. కుప్పం కోటను సైతం తమ పార్టీ బద్దలు కొట్టిందనే ఫస్ట్రేషన్ చంద్రబాబులో బాగా పెరిగిపోయిందని, దానితో ఆయన ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబు చేసే వ్యాఖ్యలు కామెడీ బిట్స్గా తయారయ్యారని ఎద్దేవా చేశారు. చంద్రబాబులో ఆక్రోశం, ఉక్రోశం పీక్స్కు చేరిందని చెప్పారు. ప్రజలను చంద్రబాబు భయపెట్టాలని అనుకుంటూంటే.. అది కాస్తా కామెడీగా మారిందని అన్నారు.

చంద్రబాబుకు సామాజిక బహిష్కరణ..
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలను తప్పుపట్టే చంద్రబాబుకు సామాజిక బహిష్కరణ చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. రోషం లేదు.. పౌరుషం లేదంటూ ప్రజలను తప్పు పట్టడం చూస్తోంటే.. ఆయనలో విపరీత ధోరణి, అహంభావం పెరిగినట్టు కనిపిస్తోందని అన్నారు. చంద్రబాబుకు రాజకీయం అనేది వారసత్వంగా వచ్చినదేమీ కాదని సజ్జల చెప్పారు. చంద్రబాబు సారథ్యంలో చంద్రబాబు సాధించిన విజయాలన్నీ గాలివాటమేనని అన్నారు. 1999, 2014లల్లో చంద్రబాబు ఎంతమందిని కలుపుకొని ఎన్నికలకు వెళ్లారో తెలిసిన విషయమేనని అన్నారు.

జగన్ ఏనాడైనా ప్రజలను తప్పుపట్టారా?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైన తరువాత.. ఎదురైన ఏ ఓటమిలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల వైఖరిని తప్పుపట్టలేదని అన్నారు. ప్రజల తీర్పును శిరసా వహిస్తున్నామంటూ ఆయన ఓటమిని హుందాగా స్వీకరించారని గుర్తు చేశారు. అలాంటి హూందాతనం చంద్రబాబులో ఏమైందని సజ్జల నిలదీశారు. రోషం..పౌరుషం అనే పదాలను వాడుతూ ప్రజలను రెచ్చగొట్టే హీనస్థాయికి ఆయన దిగజారాడని మండిపడ్డారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలకు శాశ్వతంగా తెరపడినట్టేనని అన్నారు. 2014లో వచ్చిన గొప్ప అవకాశాన్ని వినియోగంచుకోలేక, ప్రజలకు దూరమయ్యారని విమర్శించారు.

పీకడానికేముంది వాళ్ల వద్ద
ఏం పీకుతారంటూ చంద్రబాబు.. నారా లోకేష్ మాట్లాడుతున్నారని, వాళ్ల వద్ద పీకడానికేమీ మిగల్లేదని సజ్జల ఎద్దేవా చేశారు. వేడి నీళ్లలో ముంచి తీసిన బ్రాయిలర్ కోళ్లలా తండ్రి కొడుకులు తయారయ్యారని అన్నారు. కొద్దిరోజులు పోతే.. చంద్రబాబును వాళ్ల పార్టీ తమ్ముళ్లే సామాజిక బహిష్కరణ చేస్తారని చెప్పారు. ప్రజలను తిట్టే రాజకీయ నాయకులను మొదటిసారిగా చూస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. బహుశా- ఇవే చివరి ఎన్నికలు అనే విషయం చంద్రబాబుకు తెలియడం వల్లే ఫస్ట్రేషన్కు గురవుతున్నారని చెప్పారు.

90 శాతం గెలుస్తాం..
మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో 90 శాతం మేర విజయాన్ని నమోదు చేస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి ధీమాను వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వ పరిపాలనను చూసిన ప్రజలే స్వచ్ఛందంగా తమ తీర్పు ఇస్తారని అన్నారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు కిందిదాకా చేరాలంటే.. అన్ని పరిపాలన వ్యవస్థల్లోనూ అధికార పార్టీ ఉంటేనే సాధ్యపడుతుందని, డెలివరి సిస్టమ్ బాగుంటుందని అన్నారు. లేకపోతే- తాము అమలు చేసే పథకాలను ప్రత్యర్థి పార్టీలకు చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు అడ్డుకునే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications