వైసీపీ అనుమానించిందే నిజమైందా ? ఫోన్ ట్యాపింగ్లో విషయంలో బయటకు వస్తున్న కీలక అంశాలు!
వైసిపి అధినేత అనుమానం నిజమని తేలింది. ఎన్నికల సమయంలో వైసిపి నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఏపి అధికారుల మీద పార్టీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు. కోర్టులోనూ కేసు దాఖలు చేసారు. అందులో ప్రభుత్వ తరపు న్యాయవాది ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు అంగీకరించారని వార్తలు వస్తున్నాయి. దీని పైన కోర్టు పూర్తి స్థాయి సమాచారం కోరింది..
మొదటి నుండి అనుమానాలు..
ఏపిలో నిఘా అధికారులు తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ వైసిపి నేతలు చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. వైసిపి అధినేత జగన్ సైతం ఈ అనుమానం వ్యక్తం చేసారు. ఎన్నికల ముందు ఈ తరహా ఆరోపణలు ఎక్కువయ్యాయి. ఇక, దీని పైన వైసిపి నేత సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టులో కేసు దాఖలు చేసారు. అంతకు ముందు పార్టీ ఎంపి విజయ సాయిరెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు. ఇక, హైకోర్టులో విచారణ సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఫోన్ ట్యాపింగ్ నిజమేనని హైకోర్టు ముందు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. టెలిగ్రాఫ్ చట్టం 1885లోని సెక్షన్ 5(2)ను అనుసరించే ఆ పని చేశామని తెలిపింది. దీనిపై స్పందించిన హైకోర్టు, ఈ వివరాలను కౌంటర్ రూపంలో లిఖితపూర్వకంగా తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పూర్తి వివరాలు సమర్పించండి..
వైసీపీకి చెందిన నాయకుల ఫోన్లను అధికార పార్టీ కోసం పోలీసులు ట్యాపింగ్ చేస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ పార్టీకి చెందిన ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేస్తున్నారో జాబితాను సమర్పించేలా కేంద్ర హోంశాఖ కార్యదర్శి, టెలి కమ్యూనికేషన్స్ కార్యదర్శి, వోడాఫోన్ ఏపీ, తెలంగాణ నోడల్ ఆఫీసర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. అలాగే డీజీపీ ఠాకూర్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, ఇంటెలిజెన్స్ డీజీలను టెలిగ్రాఫ్ చట్టం కింద ప్రాసిక్యూట్ చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన హైకోర్టును అభ్యర్థించారు.ఈ వ్యాజ్యంపై జస్టిస్ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది.
చట్టానికి లోబడే ట్యాపింగ్ చేసాం
విచారణలో భాగంగా ధర్మాసనం స్పందిస్తూ, ఏఏ సందర్భాల్లో ట్యాపింగ్ చేయవచ్చో సెక్షన్ 5(2) చెబుతోందని, ఇదే విషయంపై సుప్రీంకోర్టు సైతం స్పష్టమైన తీర్పునిచ్చిందని గుర్తు చేసింది. దీనికి ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ, సెక్షన్ 5(2)ను అనుసరించే ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పారు. తాము చట్ట ప్రకారమే నడుచుకున్నామని వివరించారు. అయితే ఈ వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. విచారణను జూన్ 6కి వాయిదా వేసింది.