చంద్రబాబుపై హైకోర్టు రిటైర్డ్ జడ్జితో ఎంక్వైరీ: నెల రోజులే- అంత తేలిగ్గా వదలట్లేదుగా
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా కందుకూరు, గుంటూరుల్లో నిర్వహించిన సభల్లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఉదంతాన్ని ఏపీ ప్రభుత్వం అంత తేలిగ్గా వదిలేలా కనిపించట్లేదు. ఏకంగా 11 మంది మృత్యువాత పడటానికి కారణమైన ఈ రెండు ఉదంతాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరంత తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటోంది.
కిందటి నెల 28వ తేదీన కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన రోడ్ షోలో సంభవించిన తొక్కిసలాటలో ఎనిమిది మంది, జనవరి 1వ తేదీన గుంటూరులోని వికాస్ నగర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మరో ముగ్గురు మహిళలు మరణించిన విషయం తెలిసిందే. ఈ రెండు ఘటనలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయాలను ఇదివరకే తీసుకుంది కూడా.

నడిరోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధించింది. దీనికి సంబంధించిన జీవోను ఇటీవలే విడుదల చేసింది హోం మంత్రిత్వ శాఖ. పలు నిబంధనలను సూచించింది ఇందులో. బహిరంగ సభలను నిర్వహించడానికి అవసరమైన స్పష్టమైన మార్గదర్శకాలను జీవో నంబర్ 1లో పొందుపరిచింది. కందుకూరు, గుంటూరు తరహా విషాదకర, దిగ్భ్రాంతికర సంఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో దీన్ని అమలులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం.

అక్కడితో ఆగలేదు. మరో అడుగు ముందుకేసింది జగన్ సర్కార్. కందుకూరు, గుంటూరు తొక్కిసలాట సంఘటనలపై న్యాయ విచారణకు ఆదేశించింది. జ్యుడీషియరీ ఎంక్వైరీ కమిషన్ ను ఏర్పాటు చేసింది. పదవీ విరమణ చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ శేషశయన రెడ్డిని ఈ కమిషన్ ఛైర్మన్ గా అపాయింట్ చేసింది. ఈ రెండు ఉదంతాలపై సమగ్రంగా విచారణ జరుపుతుందీ కమిషన్. నెల రోజుల్లోగా తన విచారణను పూర్తి చేయాల్సి ఉంటుందీ కమిషన్ కు. అనంతరం తన నివేదికను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది.

కందుకూరు, గుంటూరు ఉదంతాలు- రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ మధ్య పెద్ద ఎత్తున వాగ్యుద్ధానికి దారి తీసింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు ఈ రెండు పార్టీల నాయకులు. వైఎస్ఆర్సీపీ సహా రాజకీయ పార్టీలన్నీ నిర్వహించబోయే రోడ్లు, బహిరంగ సభలను నిషేధించింది. గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసుకునే వెసలుబాటు కల్పించింది.












Click it and Unblock the Notifications