ఆ 52 కేసులపై జగన్ సర్కారు ఆందోళన.. ఈ లెక్క తేలకపోతే అంతే సంగతులు..
ఏపీలో కరోనా వైరస్ సోకడానికి ఇప్పటివరకూ గుర్తించిన ప్రధాన కారణాలు రెండు లేక మూడు. వీటిలో ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు, విదేశాలకు వెళ్లి వచ్చిన వారు, వీరి నుంచి సోకిన వారు. ఇవేవీ కాకుండా తాజాగా బయటపడిన 52 కేసుల విషయంలో మాత్రం ప్రభుత్వం ఎటూ తేల్చలేకపోతోంది. వీరి లెక్క తేల్చకపోతే కరోనా నియంత్రణ పూర్తిగా సాధ్యం కాదనే వాదన వినిపిస్తోంది.

ఎవరా 52 మంది కరోనా బాధితులు ?
ఏపీలో ఇప్పటివరకూ గుర్తించిన కరోనా రోగుల సంఖ్య తాజా లెక్కల ప్రకారం 800 దాటిపోయింది. వీరిలో 96 మంది ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి ఇక 24 మంది మృతులను కూడా తీసేస్తే మిగిలిన వారు ఇప్పటికీ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే వీరిలో 52 మందిది మాత్రం ఓ ప్రత్యేక లెక్క. అందుకే ఇప్పుడు ప్రభుత్వం వీరిపై ప్రత్యేక దృష్టిసారిస్తోంది.

ప్రయాణాలు చేయకపోయినా...
వాస్తవానికి ఏపీ ప్రభుత్వం గుర్తించిన కేసుల్లో దాదాపు అన్నీ విదేశాలో లేక ఢిల్లీ వెళ్లి వచ్చిన వారివే. కానీ తాజాగా బయటపడిన 52 మందికి మాత్రం ఎలాంటి ప్రయాణ చరిత్ర లేదు. అలాగని వీరంతా ప్రయాణాలు చేసిన వారికి కాంటాక్ట్ అయిన వారు కూడా కాదు. కానీ వీరికి కరోనా వైరస్ సోకింది. ఇదెలా జరిగిందో ఆరా తీసే పనిలో ప్రస్తుతం ఏపీ వైద్యారోగ్యశాఖ నిమగ్నమై ఉంది.

సామాజిక వ్యాప్తిలో భాగమేనా ?
ఎలాంటి ప్రయాణ చరిత్ర లేకుండా, ప్రయాణాలు చేసిన వారితో కాంటాక్ట్ కూడా కాకుండా కరోనా బాధితులుగా మారిన 52 మంది వ్యవహారంపై ప్రభుత్వం లోతుగా దర్యాప్తు చేస్తోంది. పూర్తిగా నిర్ధారణ కాకున్నా ఇలాంటి వారిని ప్రస్తుతానికి సామాజిక వ్యాప్తిలో భాగంగా కరోనా సోకిన వారిగా ప్రభుత్వం లెక్కల్లో చూపుతోంది. అంటే ప్రయాణాలు చేయకుండా, ప్రయాణాలు చేసిన వారిని తాకకుండా దూరంగా ఉన్న వారికి అప్పటికే వైరస్ సోకిన ప్రాథమిక కాంటాక్ట్ ల నుంచి సోకినట్లు చెబుతున్నారు. అంటే సెకండరీ కాంటాక్ట్ గా వీరిని భావించవచ్చు.
Recommended Video

వీరితోనే ప్రమాదం అధికం..
గతంలో ప్రయాణ చరిత్ర కలిగిన వారో, లేక వారి నుంచి ప్రాథమికంగా వైరస్ సోకిన వారో అయితే గుర్తించడం సులభం. ప్రయాణాలు చేసిన వారిని టికెట్లు, ఇతర రికార్డుల ఆధారంగా గుర్తించవచ్చు. అలాగే వీరి నుంచి సోకిన వారిని కుటుంబ సభ్యులుగా, సన్నిహితులు, స్నేహితులుగా గుర్తించారు. కానీ వీరి నుంచి ఇతరులకు సోకిన వారిని మాత్రం ప్రాధమిక దశలో గుర్తించలేదు. దీంతో ఈ 52 మంది ఎవరెవరిని కలిశారు. వీరికి ఎవరి వల్ల సోకింది, వీరి నుంచి ఇతరులు ఎవరికి వైరస్ సోకిందన్న అంశాలు చాలా క్లిష్టంగా మారాయి. ఈ లెక్క తేలితేనే కానీ రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణలోకి రాదని వైద్యారోగ్యశాఖ చెబుతోంది.












Click it and Unblock the Notifications