రహస్య జీవోలు-టీడీపీ వివాదంలో కొత్త ట్విస్ట్ : ఇక ఆఫ్ లైన్ లోనే-అన్ని శాఖలకు సర్క్యులర్..!!
కొద్ది రోజులుగా ఏపీ ప్రభుత్వం జీవోల జారీ వ్యవహారం రాజకీయం వివాదంగా మారింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోలు రహస్యంగా ఉంచుతోందని..దీని వెనుక ఏదో జరుగుతోందంటూ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఆరోపణలు చేసింది. దీని పైన నేరుగా గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేసింది. ప్రధానంగా ఈ నెలలో జారీ చేసిన బ్లాంక్ జీవోల వ్యవహారం పైన టీడీపీ నిలదీస్తోంది. పారదర్శక పాలన అని చెబుతూ ఎందుకు రహస్య జీవోలు...బ్లాంక్ జీవోలు జారీ చేస్తున్నారని టీడీపీ నేతలు నిలదీస్తున్నారు.

జగన్ ప్రభుత్వం తాజా నిర్ణయం..
అయితే, గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో..అంతకు ముందు కిరణ్ కుమార్ రెడ్డి హాయంలోనూ ఇలా జీవీలు కాన్ఫిడెన్షియల్ లో ఉంచటం సాధారణంగా జరిగే ప్రక్రియే నంటూ అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. వైఎస్సార్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో 2008 లో జీవోలను ప్రభుత్వ డొమైన్ లో ఉంచటం ఉమ్మడి ఏపీలో మొదలు పెట్టారు. అయితే, ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆన్ లైన్లో జీవోలు పెట్టకూడదని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. జీవోలను ఆఫ్ లైన్లోనే పెట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచన చేస్తూ ఇంటర్నల్ సర్క్యులర్ జారీ చేసింది.

టీడీపీ చేసిన ఆరోపణలకు ఇదే సమాధానమా..
పొరుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానమే ఏపీలోనూ అమలు చేయాలని డిసైడ్ అయింది. దీని ద్వారా ఇక నుంచి ప్రభుత్వ జీవోలు పబ్లిక్ డొమైన్ లో కనిపించే అవకాశం లేదు. ప్రధానంగా ఈ నెల ప్రారంభం నుంచి రిలీజ్ అవుతున్న ఈ బ్లాంక్ జీవోల వ్యవహారం రాజకీయంగా వివాదానికి దారి తీయటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తాము చేసిన ఫిర్యాదులో భాగంగా.. బ్లాంక్ జీవోలు చూసి గవర్నర్ సైతం ఆశ్చర్యపోయారని కొద్ది రోజుల క్రితం టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య చెప్పుకొచ్చారు.

ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే విధంగా..
పాలనా వ్యవహారాల్లో భాగంగా అన్ని అధికార నిర్ణయాలు.. జారీ కావాల్సిన జీవోలను పబ్లిక్ డొమైన్ లోనే ఉంచుతున్నామనేది ప్రభుత్వ వాదన. కొన్ని రహస్యంగా ఉంచాల్సిన అంశాలను మాత్రం జీవోలు కాన్ఫిడెన్షియల్ గా చూపిస్తారని వివరణ ఇస్తున్నారు. అయితే, ప్రతిపక్షాలు మాత్రం ఈ వ్యవహారాన్ని పాలనలో ఏదో జరుగుతోందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని అధికార పార్టీ నేతల వాదన. ప్రస్తుతం ఏపీలో ఆర్దిక వ్యవహారాలు..మూడు రాజధానుల వ్యవహారం సున్నిత మైన అంశాలుగా మారుతున్నాయి.

ప్రభుత్వ వ్యవహారాల్లో కఠినంగా..
అదే విధంగా కొద్ది రోజుల క్రితం ప్రభుత్వ సమాచారం ఉద్దేశ పూర్వకంగా బయటకు లీక్ చేసారనే కారణంగా ఆర్దిక శాఖలో పలువురి సిబ్బంది పైన ప్రభుత్వ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఇక, ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో అమలు చేయటం లేదంటూ..ఏపీలోనూ పబ్లిక్ డొమైన్ లో జీవోలను ఉంచకూడదని అంతర్గతంగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అన్ని శాఖల ప్రధాన కార్యదర్శులకు సర్క్యులర్ జారీ చేసారు. ఇప్పుడు దీని పైన రాజకీయంగా ఎటువంటి స్పందన వస్తుందనేది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications