విశాఖ మెడ్ టెక్ జోన్ పై టీడీపీ రచ్చ- ఎట్టకేలకు స్పందించిన జగన్ సర్కార్..
2017లో టీడీపీ హయాంలో ప్రారంభించిన విశాఖ మెడ్ టెక్ జోన్ పై వైసీపీ ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ విపక్ష టీడీపీ కొన్ని రోజులుగా అదే పనిగా ఆరోపణలు చేస్తోంది. మెడ్ టెక్ జోన్ లో భారీ కుంభకోణం చోటుచేసుకుందని ఓసారి, పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని మరోసారి, కరోనా వైరస్ ను ఎదుర్కొనే పరికరాల తయారీ కోసం దీన్ని వాడుకోవడం లేదని ఇంకోసారి టీడీపీ ఆరోపణలు చేసింది. అయితే ఇవన్నీ నిరాధారమని ప్రభుత్వం ఇవాళ స్పష్టం చేసింది.

మెడ్ టెక్ జోన్ పై టీడీపీ రచ్చరచ్చ..
విశాఖలో 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం వైద్య పరికరాల తయారీ, పరిశోధనల కోసం మెడ్ టెక్ జోన్ ఏర్పాటు చేసింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలన్నింటికీ ఒకే చోటకు చేర్చితే రాష్ట్రంలో వైద్యరంగం అభివృద్ధికి ప్రయోజనం ఉంటుదని భావించిన చంద్రబాబు సర్కారు.. 70 ఎకరాల విస్తీర్ణంలో తొలుత దీన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత రెండో దశ అభివృద్ధి కోసం ఏపీఐఐసీ ద్వారా మరో 200 ఎకరాల స్ధలాన్ని మెడ్ టెక్ జోన్ కు అప్పగించారు. త్వరలో ఆసియా అభివృద్ధి బ్యాంకు సాయంతో పనులు కూడా ప్రారంభం కావాల్సి ఉంది. కానీ అంతలోపే వైసీపీ ప్రభుత్వం వచ్చాక దీన్ని నిర్వ్రీర్యం చేసిందని, కుంభకోణాలు జరిగిపోతున్నాయని, కరోనా వైరస్ ను ఎదుర్కొనే వైద్య పరికరాలను ఇక్కడ తయారు చేయడం లేదని టీడీపీ పదే పదే ఆరోపించింది.

మెడ్ టెక్ జోన్ పై ప్రభుత్వం వివరణ..
మెడ్ టెక్ జోన్ ను కరోనా విపత్తు సమయంలోనూ వాడుకోవడం లేదంటూ తాజాగా విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు కూడా నేరుగా ఆరోపణలు చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. తాజాగా వైద్య పరికరాల కోసం ఇచ్చిన ఆర్డర్లతో సహా పలు కీలక వివరాలను అధికారులతో బయటపెట్టించింది. మెడ్ టెక్ జోన్ అభివృద్ధి కోసం జరుగుతున్న ప్రయత్నాలను పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ భార్గవతో పాటు పశుసంవర్ధక, మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైసీపీ ప్రభుత్వం వచ్చాక చేపట్టిన పనులను వివరించారు. గతంతో పోలిస్తే మెడ్ టెక్ జోన్ ను ఐదురెట్లు అభివృద్ధి చేస్తున్నామని, 177 కంపెనీలు ఏర్పాటుకు ముందుకొచ్చాయని వారు పేర్కొన్నారు.

కోవిడ్-19 ఎదుర్కొనే పరికరాల తయారీ..
రాష్ట్రంలో కోవిడ్ వైరస్ ప్రభావం ప్రారంభం కాకముందే డిసెంబర్ లోనే ముందుజాగ్రత్త చర్యగా కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు అవసరమైన మెడికల్ కిట్లు, ఇతర పరికరాలను మెడ్ టెక్ జోన్ లో కంపెనీలకు ఆర్డర్ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఏప్రిల్ 15 నాటికి గతంలో ఇచ్చిన ఆర్డర్ల ప్రకారం కిట్లు ప్రభుత్వానికి అందుతాయని కూడా అధికారులు పేర్కొన్నారు. మెడ్ టెక్ జోన్లో ప్రస్తుతం 13 ల్యాబ్ లు పనిచేస్తున్నాయని, వాటిలో పెండింగ్ పనుల కోసం 30 కోట్లు విడుదల చేశామన్నారు. ధర్మల్ స్కానర్లతో పాటు కరోనా డయాగ్నస్టిక్ కిట్లు కూడా ఇక్కడ తయారవుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

టీడీపీ ఆరోపణలకు చెక్..
రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మెడ్ జెక్ జోన్ ను వాడుకోవడం లేదంటూ టీడీపీ ఇన్నాళ్లూ చేస్తున్న ప్రచారానికి ప్రభుత్వం గట్టిగా చెక్ పెట్టింది. రేపటి నుంచి మెడ్ జోన్ నుంచి కరోనా నియంత్రణ కిట్లు, ఏప్రిల్ 15 నుంచి వెంటిలేటర్లు సైతం అందుబాటులోకి వస్తాయని అధికారులు చేసిన ప్రకటన ఇప్పుడు టీడీపీ ఇన్నాళ్లుగా చేస్తున్న ప్రచారం ఒట్టిదేనని నిరూపించినట్లయింది.
ప్రభుత్వం తాజా ప్రకటన ప్రకారం చూస్తే మెడ్ టెక్ జోన్ నుంచి ఏప్రిల్ నెలలో 3 వేల వెంటిలేటర్లు, మే నుంచి 6 వేల వెంటిలేటర్ల సరఫరా జరగనున్నట్లు తెలుస్తోంది. వీటికి ఐసీఎంఆర్ ఆమోదం కూడా ఉందని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications